ఖైరతాబాద్, జూన్ 28: ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి పదవి చేపట్టినా రైతాంగ సమస్యలపై అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేత జగ్జీత్సింగ్ దలైవాలా విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ నల్ల చట్టాలపై పోరా టం సందర్భంగా చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని ధ్వజమెత్తారు. రైతుల విషయంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యమాన్ని పునః ప్రారంభించామని, ఈ ఉద్యమానికి దక్షిణాది రైతుల మద్దతును కూడగట్టేందుకు ఆయా రాష్ర్టాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు.
త్వరలో ఢిల్లీలో 10 వేల మందితో సదస్సు నిర్వహిస్తామని, బీజేపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు క్వింటాల్ వరికి రూ.3,100 చొప్పున మద్దతు ధర నిర్ణయిస్తే కేంద్రం మాత్రం రూ.2,300 ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల్ల వెంకటేశ్వర్రావు, దక్షిణ భారత కన్వీనర్ కురుబూరు శాంతకుమార్ పేర్కొన్నారు.
బడా పారిశ్రామికవేత్తలకు ఏకం గా రూ.14 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ సర్కారు.. వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా రైతులకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. రైతులు వ్యవసాయాన్ని మానేస్తే దేశంలో ఆకలి మంటలు చెలరేగుతాయని హర్యానా రాష్ట్ర రైతు సంఘం నాయకుడు అభిమన్యు కోహర్ హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం నేత పీ చంగల్రెడ్డి, తమిళనాడు నేత పీఆర్ పాండ్యన్, హర్యానా, న్యూఢిల్లీకి చెందిన లక్వీందర్సింగ్, జాఫర్ఖాన్, సుఖ్జీత్సింగ్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.