Rythu Runa Mafi | న్యూస్ నెట్వర్క్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ గందరగోళంగా మారింది. రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామంటూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు కానరాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్నీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. కొన్ని సహకార సంఘాల్లో సగం మందికి, మరికొన్ని చోట్ల 25% మందికి, మరికొన్ని చోట్ల అసలు ఏ ఒక్కరికీ రుణమాఫీ కాకపోవడంతో అసలు ఏం జరుగుతున్నదో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీకి నోచుకోని రైతులు వ్యవసాయ పనులన్నీ మానుకొని, వ్యవసాయ అధికారులు, బ్యాంకుల వద్దకు, చివరకు కలెక్టరేట్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా సరియైన సమాధానం లభించకపోవడంతో ’కొందరికి మాఫీ చేసి, కొందరికి మాఫీ చేయకపోవడం.. ఇదేం పద్ధతి?’ అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదని నెత్తిబాదుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగం మందికి కూడా రూ.లక్ష లోపు రుణమాఫీ కాలేదు. జిల్లాలో డీసీసీబీల నుంచి నేరుగా 1,646 మంది, పీఏసీఎస్ల నుంచి 33,914 మంది మొత్తంగా 35,560 మంది రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 09, 2023 నాటికి వడ్డీతో కలిపి ఈ రైతులు తీసుకున్న లోన్ మొత్తం రూ.183.21 కోట్లు ఉండగా, తొలి విడత లక్ష వరకు చేసిన రుణమాఫీలో రూ.63.25 కోట్లు మాఫీ అయ్యాయి. అంటే రైతులు తీసుకున్న మొత్తం రుణంలో 34.52 శాతమే మాఫీ అయ్యింది. ఉమ్మడి జిల్లాలో 12,477 మంది రుణాలే మాఫీ అయ్యాయి. అంటే 35% మందికే మాఫీ అయింది. మిగిలిన వారికి ఎందుకు రాలేదు అనే విషయంలో అధికారులకే స్పష్టతలేదు. తలమడుగు మండలంలో గల మహారాష్ట్ర బ్యాంకులో 2,300 మంది బ్యాంకు రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్షలోపు బాకీ ఉన్న రైతులు 382 మంది ఉండగా, 36 మందికి రుణమాఫీ అయింది. మిగతా 346 మందికి అసలు బాకీ కంటే తక్కువ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతులు కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించారు.
వందేండ్ల చరిత్ర కలిగిన ఖమ్మం డీసీసీబీ రైతులు తొలిసారిగా భారీ నిరాశకు గురయ్యారు. నాలుగు జిల్లాల రైతాంగానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న ఖమ్మం డీసీసీబీకి ప్రభుత్వం రుణమాఫీ నిధుల్లో భారీకోత విధించింది. డీసీసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రసహకార బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులు 1,69,864 మంది ఉన్నారు. పంట రుణమాఫీకి సంబంధించి రూ.908.27 కోట్లు రావాల్సి ఉన్నది. ఖమ్మం జిల్లాలో 1,16,291 మందికిగాను రూ.647.76 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47,003 మందికి రూ.235.23 కోట్లు, ములుగు జిల్లాలో 1,375 మంది రైతులకు రూ.6.50 కోట్లు, మహబూబాద్ జిల్లాకు సంబంధించి 5,195 మంది రైతులకు రూ.18.33 కోట్లు అవసరం ఉంటుంది. రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు 1,43,327 మంది కాగా, వారికి రూ.526 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది. అయితే 37,625 మంది రైతులకు రూ.121.63 కోట్లను మాత్రమే విడుదల చేశారు. దీంతో 25% మంది రైతులకే రుణమాఫీ వర్తించినట్టయ్యింది.
జగిత్యాల జిల్లాలో రూ.లక్ష లోపు పంట రుణాలు ఉన్నవారి సంఖ్య దాదాపు లక్ష మంది ఉండగా, వీరిలో 39 వేల మందికే రుణమాఫీ జరిగింది. దీంతో జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్నది. బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులను రైతులు పెద్ద సంఖ్యలో కలిసి విన్నవిస్తున్నారు. అయితే, మూడు దఫాల్లో రుణమాఫీ ఉంటుందని, మరో దఫాలో వచ్చే అవకాశం ఉన్నదని రైతులకు అధికారులు నచ్చచెప్తున్నారు. మల్యాల మండలం మల్యాల, తక్కళ్లపల్లి సింగిల్ విండో కార్యాలయాల పరిధిలో రుణం తీసుకున్న రైతుల్లో సంగం మందికి రుణం మాఫీ కాలేదు. కొందరు రైతుల పేరిట వచ్చిన రుణమాఫీ మొత్తం చూసి సింగిల్ విండో సిబ్బంది, బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. రూ.లక్షల్లో రుణం ఉంటే వేలల్లో రుణమాఫీ జరిగినట్టు రైతుల పేరిట ప్రకటించడం విస్మయానికి గురి చేస్తున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు సింగిల్ విండో పరిధిలోని సహకార బ్యాంకులో 589 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో 339 మంది రైతులను రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వీరిలో 279 మంది లక్షలోపు లోన్ తీసుకున్నవారు ఉన్నారు. తొలి జాబితాలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. దీంతో వీరందరూ సింగిల్విండో, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పెద్దూరు సింగిల్విండో సిరిసిల్లలోని ఎస్బీఐ బ్యాంకుకు అనుసంధానంగా ఉన్నది. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ను వివరణ కోరగా, తమ పని తాము చేశామని, ప్రభుత్వమే సోసైటీ ఖాతాలో జమ చేయాల్సి ఉన్నదని చెప్పారు. నాబార్డు అధికారిని వివరణ కోరగా ఇంకా తమకు స్పష్టత రాలేదని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని డీసీసీబీ ఆధ్వర్యంలో రైతులకు పెద్దమొత్తంలో పంట రుణాలు ఇచ్చారు. రూ.లక్ష వరకు రుణం పొందిన వారిలో 72 వేల మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. వారికి రూ.316 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది. తొలి జాబితా ప్రకారం అర్హులైన వారిలో 46% మందికే రుణమాఫీ వర్తిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డీసీసీబీ అధికారుల లెక్కల ప్రకారం 33,913 మందికే రూ.143.11 కోట్ల రుణాలు మాఫీ కానున్నా యి. మిగతా 54% మంది పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. గుండాల పీఏసీఎస్లో రూ.లక్ష రుణం ఉన్న రైతుల సంఖ్య 1,559 కాగా, మాఫీ అయ్యింది మాత్రం 850 మందికే. వలిగొండ మండలం అర్రూర్ పీఎసీఎస్లో 472 మందికి గానూ 297 మందికి మాఫీ వర్తించింది. రామన్నపేట పీఏసీఎస్లో 615 మందికిగాను 168 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. మోత్కూర్లో 778 మందికిగాను 238 మందికి మాత్రమే వచ్చింది. ఆత్మకూర్(ఎం)లో 566 మందికిగాను 239 మందికే మాఫీ వర్తించింది. తుర్కపల్లి పీఏసీఎస్లో 822 మందికి గాను 495 మందికే మాఫీ వర్తించింది.
ఉమ్మడి వరంగల్ డీసీసీబీ పరిధిలో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారు 71వేల మంది ఉన్నారు. వీరిలో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు 54,400 మంది కాగా, రుణమాఫీ కింద రూ.249 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉన్నది. కానీ, తొలి జాబితాలో సగం మందికి కూడా రుణాలు మాఫీ కాలేదు. రూ.లక్ష రుణమాఫీ కింద కేవలం 23,841 మందికి రూ.106.71 కోట్లు చెల్లించినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇంకా 30,559 మంది రైతులకు రూ.లక్ష లోపు రుణాలు మాఫీ కా వాల్సి ఉన్నది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి రూ.లక్ష రుణమాఫీకి అర్హులైన రైతులు 549 మంది ఉండగా, ప్రభు త్వం 348 మంది రైతులకే రుణమాఫీ చేసింది.
వికారాబాద్లో రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. పంట రుణాలు మాఫీ అయినట్టు మొబైల్ఫోన్కు మెసేజ్లు రాకపోవడం, అధికారులు విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు జిల్లాలోని వ్యవసాయ కార్యాలయాలు, ఏఈవోలు, మండల వ్యవసాయాధికారి కార్యాలయాలకు తరలివస్తున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్రూంకు ఒక్కరోజులోనే 700 ఫోన్ కాల్స్ వచ్చినట్టు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే తమ రుణాలు మాఫీ కాలేదని సర్కారు తీరుపై రైతులు మండిపడుతున్నారు. డీసీసీబీ, పీఏసీఎస్ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల్లో కనీసం సగం మందికి కూడా రుణాలు మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన ఎర్ర అంజమ్మకు తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ.70 వేలు క్రాప్ లోన్ ఉన్నది. కానీ, రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఈమె పేరు లేదు. ఎందుకు రాలేదని అధికారులను అడిగితే తమకేమీ తెలియదనే సమాధానం వచ్చింది. దీంతో ఆమె ఆందోళనకు గురవుతున్నది. తాను తీసుకున్న రుణం మాఫీ అవుతుందా? లేదా? అనే మీమాంశలో పడింది. ఇదే అంజమ్మ కరీంనగర్లోని కేడీసీసీబీ బ్యాంక్లో తీసుకున్న రూ.50 వేల రుణాన్ని గత ప్రభుత్వం వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించింది. గత ప్రభుత్వంలో తాము ఎక్కడికి వెళ్లకున్నా, ఎవరినీ కలవకున్నా, ఎలాంటి పైరవీ లేకుండా తనకు రుణమాఫీ జరిగిందని అంజమ్మ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన లిస్ట్లో తన పేరు లేదని, ఇంకొక లిస్ట్ ఉన్నదని అధికారులు చెప్తున్నారని, అందులోనైనా వస్తుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదని అంటున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన నల్ల నర్సింహారెడ్డి 2022 ఆగస్టు 11న మల్యాల సింగిల్ విండో బ్యాంకులో రూ.1.49 లక్షలు రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. నిరుడు ఆగస్టులో కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణం మాఫీ చేయగా, నర్సింహారెడ్డికి సంబంధించిన అప్పులో రూ.73,500 మాఫీ అయింది. దీంతో మరో రూ.75,500 అప్పు మిగిలిపోయింది. అయితే నర్సింహారెడ్డి నిరుడు సెప్టెంబర్ 19న మళ్లీ రూ.1.49 లక్షలు లోన్ తీసుకున్నాడు. గతంలో తీసుకున్న రుణంతో కలిపి రూ.2.25 లక్షలు రుణం కలిగి ఉన్నాడు. కాబట్టి, ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఆగస్టులో ఆయనకు రుణమాఫీ కావాల్సి ఉన్నది. అయితే ఊహించని విధంగా రూ.లక్షలోపు రుణం ఉన్న వారి తొలి జాబితాలోనే నర్సింహారెడ్డి పేరు రావడంతో సింగిల్ విండో ఉద్యోగులతోపాటు నర్సింహారెడ్డి ఆశ్చర్యపోయారు. నర్సింహారెడ్డి పేరిట రూ.3,014 బాకీ ఉన్నదని, దానిని మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో బిత్తరపోయారు. రూ.2.25 లక్షల అప్పు ఉంటే, రూ.3 వేలు మాఫీ కావడం ఏమిటి? అసలు తొలి విడతలో తన పేరు ఎందుకు వచ్చిందని మల్యాల సింగిల్ విండో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దవంగరలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ పొందిన. ఆ తర్వాత మళ్లీ రూ.లక్ష రుణం తీసుకున్నా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంటున్నది. కానీ, నేను తీసుకున్న రూ.లక్ష కూడా నాకు మాఫీ కాలేదు. మాఫీ గురించి నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. దీనిపై ఎవరిని అడగాలో తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉన్నది. రుణమాఫీ గురించి అధికారులు స్పష్టత ఇవ్వాలి.
-దేశబోయిన రాజు, యువరైతు, కొరిపెల్లి, పెద్దవంగర మండలం, మహబూబాబాద్ జిల్లా
సీఎం రేవంత్రెడ్డి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని జెప్పిండు. నాకు బ్యాంకులో ఉన్నది రూ.82వేల అప్పే. అయినా లోన్ ఎందుకు మాఫీ కాలేదో తెల్వటం లేదు. రుణమాఫీ కాలేదని తలుచుకుంటుంటేనే కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయి. రుణమాఫీ కాకపోతే నేను ఎప్పటికీ లోన్ డబ్బులు కట్టలేను. ఉన్న రెండు ఎకరాల పొలంలో పత్తివేసిన. వర్షాలు లేక పత్తి మొక్కలు లేవనేలేదు. సాగుకు రూ.40వేలకు పైనే ఖర్చు పెట్టినా. కేసీఆర్ సర్కార్ మంచిగుండే. పంట వేయకముందే రైతుబంధు డబ్బులు చేతికివచ్చేటివి. ఆ డబ్బులతో పంట సాగుచేసుకునేటోన్ని. ఇప్పుడు రైతుబంధు డబ్బులు రాలేదు, పంటరుణమాఫీ కాలేదు. రేవంత్రెడ్డి సర్కారులో నాలాంటి రైతుల పరిస్థితి ఆగమే ఉంది.
-బేగరి మల్కయ్య, రైతు, కొత్లాపూర్, సంగారెడ్డి జిల్లా
నాకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2018లో ఆసిఫాబాద్ ఎస్బీఐ బ్యాంకులో రూ.45 వేల పంట రుణం తీసుకున్న. వడ్డీకట్టి రెన్యూవల్ చేసుకుంటున్న. కానీ రుణమాఫీ లిస్టులో నా పేరు రాలే. శనివారం బ్యాంకుకు వెళ్లి సార్లను అడిగితే రుణమాఫీ కాలేదన్నరు. నాకు రేషన్ కార్డు కూడా ఉంది. అయినా ఎందుకు కాలేదో తెల్వడం లేదు. ఈ కాంగ్రెసోళ్లు మాలాంటి గరీబులకు కాక ఇంకెవ్వరికి చేస్తరో మరి.
– రాస్పల్లి కౌసల్య, గుండి, కుమ్రుం ఆసిఫాబాద్ జిల్లా
నేను పెద్దూరు సొసైటీ ద్వారా రూ.90 వేలు రుణం తీసుకున్న. రుణమాఫీ కింద లక్ష మాఫీ చేస్తమన్నరు. 18న ఖాతాలో జమైతయ న్నరు. 19న ఖాతా చెక్ చేయిస్తే రుణమాఫీ పైసలు పడలేదు. బ్యాంక్ అధికారులను అడిగిన వస్తయి అంటున్నరు. మూడు రోజులుగా ఇట్లనే చెబుతున్నరు. అధికారులు రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలె.
– భూక్య తిరుపతినాయక్, రైతు, పెద్దూరు, రాజన్న సిరిసిల్ల
గీసుగొండ రైతు సహకార సంఘంలో గతేడాది రూ.30 వేల రుణం తీసుకున్న. మాఫీ అవుతుందని ఆశించినా లిస్టులో నాపేరు రాలేదు. వ్యవసాయ శాఖ, సొసై టీ అధికారులను అడిగితే మాకేం తెలియదని, లిస్టులో ఉన్న వారికే మాఫీ వర్తిస్తుందని చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాచారం లేదంటున్నారు. లక్షలోపు అందరికీ మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వందకు 60 మందికి మాఫీ కాలేదు.
-దర్శనాల కుమారస్వామి, వరంగల్ జిల్లా