దేశంలో టైర్ల సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. గోదాముల్లో సహజ రబ్బరు నిల్వలు గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో పడిపోవడంతో తయారీ ప్లాంట్లలో టైర్ల ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే టైర్ల ధరలు భారీగా పెరిగిపోయే ప్రమాదమున్నదని వాహన తయారీ దారుల సంఘం ‘ఆత్మ’ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
Rubber Stocks | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దేశంలో టైర్ల సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. గోదాముల్లో సహజ రబ్బరు నిల్వలు గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో పడిపోవడంతో తయారీ ప్లాంట్లలో టైర్ల ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే వాహనాల టైర్ల ధరలు భారీగా పెరిగిపోయే ప్రమాదమున్నదని దేశీయ వాహన తయారీదారు సంఘం ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఆత్మ) ప్రతినిధులు వెల్లడించారు. టైర్ల ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాన్ని పూడ్చడానికి రబ్బర్ బోర్డు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎందుకీ సంక్షోభం?
ప్రకృతిసిద్ధంగా లభించే రబ్బర్ (నేచురల్ రబ్బర్) ద్వారానే దేశంలోని 70 % వాహన టైర్లు తయారవుతున్నాయి. హీవియా చెట్ల ద్వారా లభిస్తున్న రబ్బర్తోనే ప్రధాన కంపెనీలన్నీ టైర్ల ఉత్పత్తులను చేపడుతున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ఆ చెట్ల నరికివేత పెరిగిపోవడంతో సహజ రబ్బరు ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఇదే సమయంలో దేశీయ వాహన టైర్ల ఆర్డర్లు 5 శాతం మేర పెరిగాయి. దీంతో టైర్ల సంక్షోభం నెలకొన్నది. టైర్ల ఉత్పత్తికి 14 లక్షల టన్నుల రబ్బర్ అవసరమవుతుండగా, గోదాముల్లో ప్రస్తుతం 3.7 లక్షల టన్నుల రబ్బర్ నిల్వలు మాత్రమే ఉన్నట్టు రబ్బర్ బోర్డ్ వర్గాలు తెలిపాయి. సహజ రబ్బరుకు కొరత ఉండటంతో టైర్ల తయారీకి సింథటిక్ రబ్బర్ను కొన్ని కంపెనీలు వినియోగిస్తున్నట్టు సమాచారం. దీంతో సింథటిక్ రబ్బర్ మెటీరియల్కు డిమాండ్ పెరిగి.. అంతిమంగా టైర్ల ధరలు కూడా భారీగా పెరుగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తయారీలో సింథటిక్ మెటీరియల్ను అధిక మోతాదులో వాడితే టైర్ల నాణ్యత దెబ్బతింటుందని, ఇది ప్రమాదాలకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
తయారీ ప్లాంట్లు మూతబడొచ్చు!
సహజ రబ్బరు లభ్యత దేశీయంగా భారీగా పడిపోయింది. దీంతో టైర్ల తయారీ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు సరఫరా జరుగట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే, తయారీ ప్లాంట్లు మూతబడుతాయి. దేశంలో టైర్ల సంక్షోభం ఏర్పడుతుంది. ఈ సమస్యను రబ్బర్ బోర్డు వెంటనే పరిష్కరించాలి.
– రాజీవ్ బుధ్రాజా, డైరెక్టర్ జనరల్, ఆత్మ