మెదక్: మెదక్ (Medak) ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల నిరసన రెండో రోజూ కొనసాగుతున్నది. డిపో మేనేజర్, సీఐ వేధింపులు భరించలేకపోతున్నామంటూ విధులు బహింష్కరించిన డ్రైవర్లు డిపో ఎదుట శుక్రవారం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచే సిబ్బంది తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. డ్రైవర్లు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. బస్సులు అరకొరగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
టిమ్స్ డ్యూటీ చేయాలని నెల రోజుల నుంచి డిపో మేనేజర్, సీఐ వేధిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడినా కనికరించకుండా పని చేయిస్తున్నారన్నారని ఆరోపించారు. హోట్ల్లో భోజనం చేసి డిపోలో పడుకుని డ్యూటీ చేస్తున్నామని చెప్పారు. సమస్య లు పరిష్కరించాలని వారం కిందట డీఎంకు నోటీసులు అందజేశామని తెలిపారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.