MP Arvind | వినాయకనగర్, జూన్ 5: మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువని, ఒకే నియోజకవర్గానికి నాలుగు చైర్మన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఆ పెద్ద మనిషి జీవన్రెడ్డిని నిజామాబాద్కు తీసుకొచ్చి అనవసరంగా ఇరికించారని వ్యాఖ్యానించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సమాజానికి చేసిందేమీ లేదని, ఆఫీసర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు. సొంత ఫ్యాక్టరీలను డెవలప్ చేసుకుంటున్నారు తప్పితే చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలన్న ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో సుదర్శన్రెడ్డి ఓటుకు రూ.200 పంచారని, రేవంత్రెడ్డి పంపించిన డబ్బులో 70 శాతం వీళ్లే కాజేశారని అర్వింద్ ఆరోపించారు.