CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గాంధీభవన్లో గురువారం బీజేపీపై రేవంత్రెడ్డి ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో పదేండ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దే బీజేపీ ఎజెండా అని, అందుకు 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 2025లోగా రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ విధానమని ఆరోపించారు. ఎలాగైనా రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర చేస్తున్నారని సీఎం ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారని, దీనిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, వర్గీకరణ కోసం కొట్లాడిన వారు కూడా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడంలేదని పరోక్షంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణపై ధ్వజమెత్తారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దని, ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దుగా రేవంత్రెడ్డి అభివర్ణించారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీ.. పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పేరుతో పేదల శ్రమను దోచుకుందని ధ్వజమెత్తారు. ప్రజలపై రూ.168 లక్షల కోట్ల అప్పులభారం మోపి, పదేండ్లలో రూ.113 లక్షల కోట్లు అప్పులు తెచ్చి దేశాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ప్రభాకర్, సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాసు మున్షీ, నాయకులు జగ్గారెడ్డి, వేం నరేందర్రెడ్డి, ఎల్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.