మణికొండ, జూన్ 28: గండిపేట కాండూట్పై అక్రమ వ్యాపార కేంద్రాలు, నిర్మాణాలకు ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘కుచించుకుపోతున్న గండిపేట కాండూట్’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై జలమండలి ఉన్నతాధికారులు స్పందించారు. గండిపేట డీజీఎం నరహరి నేతృత్వంతో పుప్పాలగూడ సమీపంలో ఓ నిర్మాణ సంస్థ అక్రమంగా నిర్మించిన రహదారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ముందుగా రహదారిపై వేసిన టైల్స్ను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. సదరు నిర్మాణదారులు తామే స్వయంగా తొలగిస్తామని చెప్పారని, రెండు రోజుల్లో తొలగించని పక్షంలో తామే స్వయంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీఎం నరహరి తెలిపారు.
సదరు నిర్మాణ రంగ సంస్థ మొండిగా వ్యవహరిస్తున్నదని, తాము గతంలోనూ కాండూట్పై రాకపోకలకు అనుమతులు ఉండవని నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. వితండవాదంగా వ్యవహరిస్తూ రాత్రిపూట నిర్మించారని పేర్కొన్నారు. నిర్ధేశించిన సమయంలోపు కాండూట్పై రహదారులను నిలిపివేయకుంటే తామే స్వయంగా రంగంలోకి దిగి తొలగిస్తామన్నారు. అదేవిధంగా.. కాండూట్పై వెలిసిన వ్యాపార కేంద్రాలను సైతం తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నమస్తే తెలంగాణ కథనంపై మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి విశేష స్పందన రావడం విశేషం.