హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): ర్యాపిడో తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా కమీషన్ల రూపంలో అన్యాయం చేస్తున్నదని ట్యాక్సీ డ్రైవర్లు మంగళవారం మాదాపూర్లోని ర్యాపిడో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వంద మంది డ్రైవర్లు ఒక్కసారిగా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డ్రైవర్లు నినాదాలు చేశారు. ప్రత్యేక యాప్ తీసుకొచ్చి డ్రైవర్లకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చిందని, ఇంకా అది కార్యరూపం దాల్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ట్యాక్సీ డ్రైవర్లు సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్ద ధర్నాకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతించకపోవటంతో తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్న అధికారులకు వినతి పత్రం అందించారు.
అనంతరం అమ్మ క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్భూషణ్ మాట్లాడుతూ.. కమీషన్ల పేరుతో ర్యాపిడో అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. వాహనం క్యాటగిరీని బట్టి కిలోమీటర్కు ఇంత అని ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. 4+1 క్యాబ్కు కిలోమీటర్కు రూ. 30, 6+1 క్యాబ్కు రూ. 35, 7+1 క్యాబ్కు 40 రూపాయలు ఫిక్స్ చేయాలని, ఎలాంటి కోతలు లేకుండా ఈ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు స్కీంతో చాలావరకు రైడ్స్ తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు గడవడం కష్టంగా మారిందని, స్కూలు ఫీజులు, వాహన ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు మిర్జానాజఫ్ అలీ, నాగరాజు, డేవిడ్, సంతోష్కుమార్, అమర్నాథ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.