ఖైరతాబాద్, జూలై 3: నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈ నెల 5న నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న టీజీపీఎస్పీ ముట్టడికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్ధి, నిరుద్యోగ జేఏసీ గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, భృతి ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఇంతవరకు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని వాపోయారు.
ఓయూ విద్యార్ధి మోతీలాల్నాయక్ వారం రోజులుగా ఆమరణ దీక్ష చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో మూడు వేల ఉద్యోగాలను కలుపాలని, అలాగే గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్కు ఎంపిక చేయాలన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ఆయా డిమాండ్లను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే గద్దె దించుతారని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో గిరిజన రిజర్వేషన్ల సాధన సమితి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా సంజీవ్నాయక్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు, న్యాయవాది శారదాగౌడ్, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మేకల కృష్ణ, బీసీ న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశోక్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ నాయకుడు నరహరి, తదితరులు పాల్గొన్నారు.