హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది. ఆయనకు గనుల వేలంపాటపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం సిగ్గుచేటని విమర్శించింది.
నీట్ అవకతవకలపై మాట్లాడటానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కేంద్రమంత్రిని విద్యార్థి సంఘాల నేతలు కోరగా ఆయన నిరాకరించారు. దీంతో శనివారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వీజేఎస్, వైజేఎస్ సంఘాల నేతలు హైదరాబాద్లో కిషన్రెడ్డి నివాసప్రాంతానికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. ఈ తోపులాటలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్కు గాయాలయ్యాయి. 120 మంది నాయకులను అరెస్టు చేసిన పోలీసులు నల్లకుంట ఠాణాకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
నీట్పై చాయ్ పే చర్చా చేపట్టండి
విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ నీట్ పేపరు లీకేజీ అంశంపై ప్రధాని మోదీ చాయ్ పే చర్చా నిర్వహించాలని, ఇందుకు కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపరు లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని కోరారు. పరీక్ష నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సూచించారు.
ముట్టడి కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గ్యార క్రాంతి, నెల్లి సత్య, చైతన్య, వంశి, ఎస్ఎఫ్ఐ నాయకులు రజినీకాంత్, అశోక్రెడ్డి, లెనిన్, స్టాలిన్, పీడీఎస్యూ నాయకులు నాగేశ్వరరావు, సుమంత్, రుక్మత్ పాష, కోటి, వీజేఎస్ ప్రశాంత్, నరేందర్, దిలీప్, శేఖర్, ఎన్ఎస్యూఐ నాయకులు అభిజీద్ యాదవ్, విష్ణువర్ధన్, విధుర్, ఏఐవైఎఫ్ నాయకులు నెర్లకంటి శ్రీకాంత్, శ్రీమన్, మాజిద్, కల్యాణ్, డీవైఎఫ్ఐ నాయకులు కోట రమేశ్, ఎండీ జావెద్, హష్మీబాబు, క్రాంతి పాల్గొన్నారు.