డీఎస్సీని 45 రోజులపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పదోన్నతులతో ఏర్పడిన దాదాపు 10 వేల ఖాళీలను ఈ డీఎస్సీలోనే కలిపి మెగా డీఎస్సీగా వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
– ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ఎదుట గవ్వలపల్లి-రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఎంఈవో బుచ్చయ్యనాయక్, కాంప్లెక్స్ హెచ్ఎం భాస్కరరావు పాఠశాలకు వెళ్లి 15 రోజుల్లో ఉపాధ్యాయులను
పంపిస్తామని తెలిపారు.
– చిన్నశంకరంపేట
ఆర్నెళ్లుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని నీలా గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేసి తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వినూత్న రీతిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా వంటావార్పుకు సిద్ధమవుతుండగా, అధికారులు అడ్డుకున్నారు.
– రెంజల్
పాల బిల్లులు చెల్లించడం లేదని పాడి రైతులు కన్నెర్ర చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో గ్రామ వద్ద జడ్చర్ల-కల్వకుర్తి రహదారిపై వివిధ పార్టీల నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెండు నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.బిల్లుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, బకాయిలను త్వరలో చెల్లిస్తామని తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ తెలిపింది
– మిడ్జిల్
రెండు నెలలుగా తాగునీరు రావడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చెందిన మహిళలు, యువకులు ఖమ్మం-కోదాడ రహదారిపై శుక్రవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసు అధికారులు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
– కూసుమంచి
కోస్గి, జూన్ 28 : సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని ఓ పల్లె రోడ్డు సౌకర్యానికి నోచుకోలేదు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం తోగాపూర్ పంచాయతీ పరిధిలోని పందిరి హన్మండ్లు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. గ్రామానికి వెళ్లే 2 కిలోమీటర్ల రహదారి గుంతలమయంగా మారిం ది. ఇంటికి రూ.2 వేల చొప్పున చందాలు వేసుకొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. ట్రాక్టర్లతో మట్టిని తెచ్చి పోసుకున్నారు. సీఎం స్పందించి గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వర్సిటీలకు వైస్చాన్స్లర్ల నియామకాల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమివ్వాలా? లేక ప్రతిభకా? అన్నది ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నది. కాకతీయ వర్సిటీ మినహా 9 వర్సిటీలకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నెల రోజులు పూర్తయినా కమిటీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారుకావడంలేదు. దీంతో వీసీల నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలపైనే పీటముడి నెలకొన్నది. ఒక వర్సిటీని ఓసీకి, మరో వర్సిటీని ఎస్సీ లేదా ఇతర సామాజిక వర్గాలకు కేటాయిస్తారన్న వాదనలున్నాయి. ఈ రెండు తేలితేనే మిగతా వాటిపై స్పష్టత వస్తుంది. 10 వర్సిటీల వీసీల నియామకానికి జనవరి 27న ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీచేసింది. 312 మంది దరఖాస్తు చేసుకోగా, 1,382 దరఖాస్తులొచ్చాయి. మే 21తో వీసీల పదవీకాలం ముగిసిపోగా 10 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఇన్చార్జి వీసీలుగా బాధ్యతలు అప్పగించింది.