చైర్లో స్పీకర్.. సభా నాయకుడిగా సీఎం రేవంత్రెడ్డి.. పక్కనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. 9 మంది ఇతర మంత్రులు.. ఇద్దరు విప్లు.. మొత్తంగా 52 మంది సభ్యులు.. ‘నాది ఆదివాసీ రక్తం. మహిళలకు అన్యా యం జరిగితే చూస్తూ ఊరుకోను’ అని చెప్పిన మంత్రి సీతక్క అక్కడే ఉన్నారు. ‘మహిళలంటే ఆదిపరాశక్తులు’ అన్న మంత్రి కొండా సురేఖ కూడా ఆ పక్కనే ఉన్నారు. కానీ, సీఎం వ్యాఖ్యలపై సభలో క్లారిఫికేషన్ ఇచ్చుకొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి నాలుగున్నర గంటలు నిల్చొనే ఉన్నా.. ఏ ఒక్కరూ వారిని కూర్చోవాలని చెప్పలేదు. ఇదీ.. గురువారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన మరో అవమానం. పైగా, వారి నిరసన బయటి ప్రపంచానికి కనిపించకుండా, కెమెరా వారివైపు తిప్పనీయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.
BRS | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ హోరెత్తింది. నినాదాలు, నిరసనలతో మార్మోగింది. గురువాం అసెంబ్లీ ఉదయం 10.07 గంటలకు ప్రారంభం కాగా.. ఎమ్మెల్యే సబితపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. సీఎం రేవంత్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో సబితాఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదే పదే స్పీకర్కు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించలేదు. తొలుత బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి తమ సీట్ల నుంచి లేచి పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. అయినా స్పీకర్ పట్టించుకోకపోవటంతో బీఆర్ఎస్ సహచర ఎమ్మెల్యేలు సైతం లేచి పోడియంలోకి వెళ్లారు. మహిళా ఎమ్మెల్యేలు స్పీకర్కు ఎదురుగా నిలబడి నిరసన తెలియజేయగా, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ఎదుటే బైఠాయించారు.
సీఎం డౌన్డౌన్ అని నినాదాలు చేశారు. హరీశ్రావు, కేటీఆర్, జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సబితఇంద్రారెడ్డికి మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ సభనా, కౌరవ సభానా అని ప్రశ్నించారు. ఒక దశలో స్పీకర్కు హరీశ్రావు దండం పెట్టి మరీ మైక్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితేనే మైక్ ఇస్తానని, సబిత అంశంపై మాట్లాడేందుకు మైక్ ఇచ్చేది లేదని స్పీకర్ స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్కు మైక్ ఇస్తానని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి సీట్ల వద్దకు వెళ్లి కూర్చున్నారు. రాజనర్సింహా స్పీచ్ పూర్తయ్యాక బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వకుండా, కడియం శ్రీహరికి మైక్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మళ్లీ వెల్లోకి దూసుకెళ్లారు. తర్వాత హరీశ్రావుకు అవకాశం ఇచ్చిన స్పీకర్.. అర్ధాంతరంగా మైక్ కట్ చేశారు. దీంతో మళ్లీ సభలో గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సబిత, సునీత, కోవ లక్ష్మి సభలోనే నిల్చొని తమ నిరసన తెలిపారు.
క్లారిఫికేషన్ ఇచ్చుకొనేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ను సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి కోరగా.. ఆయన పట్టించుకోలేదు. వరుసగా మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారు.. విపక్ష సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు.. వాటికి సీఎం రేవంత్రెడ్డి సమాధానం ఇస్తూనే ఉన్నారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని కూర్చోవాలని చెప్పే ప్రయత్నం చేయలేదు. వారు సభలోనే లేనట్టు ప్రవర్తించారు. నిరసన విషయం తెలంగాణ సమాజానికి తెలియనీయకుండా అసెంబ్లీ కెమెరా విభాగం జాగ్రత్త పడింది. అన్ని గంటల్లో వారివైపు కెమెరా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొన్నది.
ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశమైనా ఇవ్వాలి.. లేదా సస్పెండ్ అయినా చేయాలని స్పీకర్కు ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూ చించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తుంటే సభ ఎలా ఆర్డర్లో ఉం టుందని, ఇలా సభను ఎలా నడుపుతారని, వారి సమస్యలను వినాలని, గంటలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా సభను కొనసాగించటం సరికాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి సరికాదని చెప్పారు.
సబితాఇంద్రారెడ్డిపై సీఎం వ్యాఖ్యల్ని లోకమంతా ఖండిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం సమర్థించడం గమనార్హం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనను బీజేపీపక్ష నేత మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నిరసనలతో తాము మాట్లాడే అవకాశం కోల్పోతున్నామన్నారు. ‘సీఎం అక్కలు అని సంబోధించారు.. ఇందులో పెడర్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సీఎం ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఫ్లోలో అన్నదాన్ని రాజకీయం చేయొద్దు‘ అని వారు వ్యా ఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్సభ్యులు ఆగ్రహం తో ‘బడే భాయ్.. చోటే భాయ్ ఏక్ హోగయా’ అని నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిలుచొని నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ సభ్యుల అవహేళన చేశారు. జూనియర్ ఎమ్మెల్యేలు సైతం వారిపట్ల రన్నింగ్ కామెంట్రీ చేస్తూ ఆనందం పొందారు. కొందరు సభ్యులు వెనుక సీట్లలో కూర్చొని జోకులు వేసుకుంటూ నవ్వుతూనే ఉన్నారు. తొలి నుంచి రాజగోపాల్రెడ్డి, వివేక్ నవ్వుతూనే ఉన్నారు. వీరికి మంత్రి పొన్నం ప్రభాకర్ తోడవటంతో సైగలు చేసుకుంటూ నవ్వుకున్నారు. నిలుచున్న మహిళా ఎమ్మెల్యేలు సీఎంకు ఎదురుగానే ఉన్నా కూర్చోవాలని చెప్పలేదు. పక్కనే ఉన్న మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు.
2009-2014 తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో జరిగిన సంఘటలను గుర్తుకొస్తున్నాయని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. గతంలో తెలంగాణ కోసం బీఆర్ఎస్ సభలో నిరసన తెలిపిందని, అనేక రోజులు సభ స్తంభించిందని వెల్లడించారు. తెలంగాణ కోసం అందరం మద్దతు తెలిపామని అన్నారు. ఇప్పుడూ అదే విధంగా నిరసనలు సాగుతున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటికి వచ్చి సీఎం చాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి తెలంగాన భవన్కు తరలించారు. సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి మాత్రం సభలోనే ఉండి నిల్చొని నిరసన తెలిపారు. ఉదయం సభ ప్రారంభమైన నాటి నుంచి మధ్యాహ్నం వరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మహిళా మార్షల్స్ను, బయట 30 మంది మహిళా కానిస్టేబుళ్లను సిద్ధంగా ఉంచారు. తర్వాత వారు సీఎం చాంబర్ ముందు నిరసన కొనసాగించారు. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించారు.