హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 30 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: రహస్యంగా చేయాల్సిన విచారణపై ముందుగానే తీర్పు ఎలా ఇస్తారు? మీడియాతో మాట్లాడుతూ లీకులిస్తున్నారు.. అసలు ఆ అధికారం ఎవరిచ్చారు? కొనుగోళ్లలో ఏం జరిగిందో, లోపాలు ఏమున్నాయో? అనేది మాత్రమే కమిషన్ తేల్చాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.. అంతేకానీ, ముందే తీర్పు ఇస్తే ఎట్ల? అని విద్యుత్తు కొనుగోళ్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తీరుపై ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
ఈ కమిషన్ నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. వాస్తవానికి వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగితే అవినీతికి తావుండే అవకాశం ఉంటుందని, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన కొనుగోళ్ల ఒప్పందంలో అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఇదంతా కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రయత్నమని విమర్శించారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేసిన గాలి వినోద్కుమార్.. కాళేశ్వరం అంశంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదనను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. వినోద్కుమార్ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
వ్యక్తుల మధ్య ఒప్పందాలు జరిగితే అక్రమాలు జరిగే ఆస్కారం ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో ఇతర లావాదేవీలకు తావే ఉండదు. కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలు ఉంటాయి. అదేరీతిన ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ర్టాల మధ్య విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందం జరిగింది. అదేమీ కేసీఆర్ సొంత వ్యవహారం కాదు. సీఎం హోదాలో కేసీఆర్ ఆదేశాలు ఇస్తారు గానీ, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు, ఒప్పందాల ప్రక్రియ పూర్తిచేసేది అధికారులు మాత్రమే. ఒకవేళ అధికారులు అవినీతికి పాల్పడితే, ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఆ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆ అధికారులను పక్కన పెట్టుకొని మొత్తం కేసీఆర్ తప్పు చేశాడు, కింది నుంచి పైదాకా అంతా కేసీఆర్ సంతకాలు చేశారు అన్నట్టుగా సీఎం రేవంత్ బదనాం చేస్తున్నారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయనుకుంటే విచారణకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాఫ్తు సంస్థలతోనైనా విచారణ చేపట్టవచ్చు. కానీ, న్యాయ విచారణ పేరిట కాలయాపనకు దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ అంశాలపై వేసిన 70 కమిషన్లు కించిత్తు తేల్చలేకపోయాయి. ఇప్పుడు నర్సింహారెడ్డి కమిషన్ కూడా తేల్చేదీ ఏమీ ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో చర్చ జరగకుండా, వారి దృష్టిని మరల్చేందుకు మాత్రమే ఈ కమిషన్ వేశారనేది అందరికీ అర్థమవుతుంది. విచారణను రహస్యంగా చేపట్టకుండా, ముందుగానే తీర్పు ఇస్తున్నారు. మీడియాకు లీకులు ఇస్తున్నారు. అసలు మీడియాతో మాట్లాడే అధికారం ఆయనకు ఎవరిచ్చారు? కొనుగోళ్లలో ఏం జరిగిందో, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మాత్రమే కమిషన్ తేల్చాలి. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలిగానీ తీర్పు ఇస్తే ఎట్ల? తీర్పులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఉన్నాయి కదా.
మనం ఒక ఇల్లు కట్టుకునేందుకు బిల్డర్కు కాంట్రాక్టు ఇస్తం. అందులో ఒక పిల్లర్ కుంగిపోతే బాధ్యత యజమానిదా? బిల్డర్దా? కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. కానీ అదేదో అంతా కేసీఆర్ చేయడం వల్లే అయిందంటూ రాజకీయంగా బదనాం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నాడు సీఎంగా కేసీఆర్ తాపీ పట్టి బరాజ్ నిర్మించారా? నేడు కాంగ్రెస్ అధికారంలోనే ఉన్నది కదా.. వెంటనే విచారణ చేసి బాధ్యులైన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు కుప్పకూలినట్టుగా చిత్రీకరిస్తున్నారు. రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పొద్దున లేస్తే కాళేశ్వరంలో అవినీతి అంటూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది.
రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతుంది. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నది. ఒకవైపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సాంకేతికంగా అన్నిరకాలుగా పరిశీలించి, ప్రస్తుతం మరమ్మతులు చేయాలనిని ఆదేశించింది. దాని మీద దృష్టి పెట్టకుండా, రూ.98 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రాజకీయంగా కేసీఆర్ను బదనాం చేసేందుకే సీఎం రేవంత్రెడ్డి తన సమయాన్నంతా కేటాయిస్తున్నారు. నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? మళ్లీ ఇందులో కూడా న్యాయ విచారణ అంటూ కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది.
ఎన్నికల ముందు కోదండరాంరెడ్డి, బల్మూరి వెంకట్, రియాజ్ వంటి వాళ్లు నిరుద్యోగులను బస్సుల్లో తిప్పి రాజకీయంగా వాడుకున్నరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కోదండరాంరెడ్డి, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలయ్యారు. రియాజ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యారు. ఆకునూరి మురళికి కూడా ఏదో పదవి ఇస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వందరోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అమలులోకి తీసుకొచ్చి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని 2023 అక్టోబర్ 1న సోమాజీగూడ ప్రెస్క్లబ్లో హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
అధికారంలోకి రాగానే గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు అన్ని శాఖల్లో 2,67,032 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటించనేలేదు. నిరుద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. పైగా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తూ, జైళ్లలో పెడుతున్నారు. మొన్నటిదాకా 30 లక్షల మంది నిరుద్యోగులను వాడుకున్న రియాజ్ అధికారంలోకి రాగానే హౌలాగాళ్లు, పాగల్గాళ్లు.. అని తిడతారా! ఇంత అహంకారమా? అధికారం అప్పగించిన వాళ్లు ఇంత పలుచనగా కనబడుతున్నారా? అధికారానికి ఎక్కించినవాళ్లే స్థానిక సంస్థల్లో వీళ్లను జీరో చేస్తరు. అధికార మదాన్ని దించుతరు.
రాష్ట్రంలో ఎనిమిది మందే ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి. అదే 64 సీట్లు ఉన్న కాంగ్రెస్కు కూడా ఎనిమిది ఎంపీ సీట్లే వచ్చాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందనేందుకు ఇదే ఉదాహరణ. ఏ ఒక్క వర్గానికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలనూ తుంగలో తొక్కుతున్నరు. పదోన్నతులు ఇచ్చి ఇదేదో తమ ఘనతగా చెప్పుకుంటున్నరు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా అన్ని ప్రక్రియలు పూర్తయితే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేమిచ్చినం అని చెప్తున్నరు. గత ప్రభుత్వంలో 10 మంది మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఆరుగురికి పడిపోయారు. బీసీలు గతంలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 17 మందే ఉన్నరు. కుల గణన చేస్తామని చెప్పి అది చేపట్టకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నరు. ఇలా ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయకుండా, హామీల అమలుపై చర్చ జరగకుండా కాలయాపన చేస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తాను నెరవేర్చాల్సిన బాధ్యతలను గుర్తురగాలి.