హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ పేర్కొన్నది. సెక్రటేరియట్ను విజయవంతంగా ప్రారంభించుకున్న తెలంగాణ ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. తెలంగాణ ప్రభుత్వ అంకితభావం, దీక్ష, పట్టుదల వల్లే ఇంతటి చారిత్రక నిర్మాణం సుసాధ్యమైందని జేఏసీ నేత కేవీ కృష్ణయ్య ఓ ప్రకటనలో కొనియాడారు.
నూతన పరిపాలన సౌధం తెలంగాణ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలను అందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల (టీజీవో) సంఘం అధ్యక్షురాలు మమత సంతోషాన్ని వ్యక్తం చేశారు. నూతన సచివాలయ ప్రారంభం సందర్భంగా తెలంగాణను ప్రశంసిస్తూ సందేశాన్ని పంపిన ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ఉమ్మడి లక్ష్యాల సాధనలో ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీకి టీజీవో సంఘం ఎల్లప్పుడూ సహకరిస్తుందని పేర్కొన్నారు.