మంచిర్యాల అర్బన్, జూలై 4 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం రాత్రి మూడు గంటల పాటు కరెంట్ పోవడంతో బాలింతలు, గర్భిణులు, శిశువులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎంసీహెచ్లో బుధవారం ఉదయం 10 గంటల నుంచే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దవాఖాన ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ రమేశ్ పరిశీలించగా, సమస్య ఎక్కడ ఉందో అర్థం కాలేదు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విద్యుత్శాఖ సిబ్బంది వచ్చి అండర్ గ్రౌండ్ లైన్లో కేబుల్ సమస్య ఉన్నట్లు గుర్తించగా రాత్రి 10 గంటల దాకా జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో జనరేటర్ను ఆఫ్ చేసి మరమ్మతులు ప్రారంభించారు. హాస్పిటల్ ఎలక్ట్రిషియన్ విజయ్ ఆచార్య మరమ్మతులు పూర్తి చేయగా, అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఐసీయూ, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణులు, ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న 22 మంది శిశువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంతో దవాఖాన సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డిని వివరణ కోరగా, కేబుల్ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని, త్వరలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని వివరించారు.