KCR | ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మర్ ప్లాంట్ల నిర్మాణాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో నోటీసులు ఇవ్వగా.. కేసీఆర్ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ లేఖ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు కమిషన్కు వచ్చిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది. కమిషన్ లేఖ ఈ నెల 19న రెండోసారి రాసింది. కేసీఆర్తో పాటు విద్యుత్శాఖ మాజీ మంత్రి కేసీఆర్తో పాటు పలువురికి కమిషన్ నోటీసులు పంపింది. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశాలు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. వాస్తవానికి ఈ నెల 19న కేసీఆర్తో పాటు పలువురికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. నోటీసులపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. విచారణ నిష్పక్షపాతంగా జరుగడం లేదని.. కమిషన్ చైర్మన్ నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.