హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాజకీయాలు మాని పని మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) హితవు పలికారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల వరకు రాజకీయాలు చేయాలని, ఎన్నికలు అయ్యాక కూడా రాజకీయ ఆరోపణలు సిగ్గుచేటన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్(Kodangal Lift Irrigation) కోసం 3,340 కోట్ల అంచనాలు ఎందుకు పెరిగాయని సూటిగా ప్రశ్నించారు. చుట్టూ ఉన్న నియోజకవర్గాల ప్రజల నీళ్లను రోవంత్ రెడ్డి కొల్లగొడుతున్నాడని ఆరోపించారు.
అలాగే వరంగల్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేసీఆర్ దూర దృష్టితో హాస్పిటల్ నిర్మిస్తుంటే దానిపై రాజకీయ ఆరోపణలు చేయడం సీఎం అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఐదు రోజులు ఢిల్లీలో ఉండి తెలంగాణకు ఏం తెచ్చావ్ ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎంగా మాట్లాడుతున్నాడో పీసీసీ చీఫ్గా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ ఆధ్యక్షుడు అయ్యాక వచ్చిన 5 ఎన్నికల్లో ఓటమి చెందారన్నారు. అంతెందుకు కొడంగల్లోనే ఆయనే ఓడిపోయాడని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే కానీ, దిగజారి మాట్లాడకూడదన్నారు.