హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? పోలీసులను ఉపయోగించి మరీ ఉక్కుపాదం ఎందుకు మోపుతున్నది? వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? నిజంగానే అవి నెరవేర్చలేనివా?.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, మేధావివర్గంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశాలివీ. వాస్తవానికి నిరుద్యోగులు కోరుతున్నవన్నీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలేనని విశ్లేషకు లు చెప్తున్నారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘అన్నీ’ చేస్తామంటూ అడ్డగోలు హామీ లు ఇచ్చారని, ఇప్పుడు వాటిని మరిచిపోయి నిరుద్యోగులను పూచిక పుల్లల్లా తీసి పడేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిరుద్యోగుల డి మాండ్లలో సగానికిపైగా మానవీయ కోణంలో తీసుకోవాల్సిన నిర్ణయాలేనని, అయినా ప్రభు త్వం ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నదో అర్థం కావడం లేదని అంటున్నారు.
ఎందుకు సాధ్యం కాదు?
నిరుద్యోగులు ప్రభుత్వానికి ప్రధానంగా 10 డిమాండ్లు చేస్తున్నారు. వాటిని ఒకసారి విశ్లేషిస్తే.. పరిష్కరించటం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదన్నది నిపుణుల మాట. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే గ్రూప్-1 మెయిన్కు అభ్యర్థులను 1:100 నిష్పత్తి ప్రకారం పిలవడం సాధ్యమేనని చెప్తున్నారు. జీవోలో మార్పులు చేసి టీజీపీఎస్సీకి సమాచారం ఇస్తే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు మార్పులు చేస్తారని చెప్తున్నారు.
గ్రూప్-2 పోస్టులను 2 వేలకు, గ్రూప్-3 పోస్టుల సంఖ్య 3 వేలకు పెంచాలన్నది నిరుద్యోగుల మరో ప్రధాన డిమాండ్. ఇది అసాధ్యం అనే స్థాయిలో ప్రభుత్వం స్పందిస్తున్నది. వాస్తవానికి గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలన్నది ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ చేసిన డిమాండే. ఇప్పుడు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను పెంచటం కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నదని నిపుణులు అంటున్నారు.
వివిధ శాఖల నుంచి ఇండెంట్ తీసుకొని, ఆర్థిక శాఖకు పంపితే, అనుమతులు వచ్చిన తర్వాత ప్రభు త్వం అనుమతితో.. టీజీపీఎస్సీకి పంపితే అనుబంధ నోటిఫికేషన్ వేసే వీలుంటుందని సూచిస్తున్నారు. ఇదే ప్రభుత్వం గతంలో గ్రూ ప్-1 పోస్టులను 503 నుంచి 60 పోస్టులు అదనంగా కలిపి 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
డీఎస్సీలో పోస్టుల సంఖ్యను 5 వేల నుంచి 11 వేలకు పెంచారని చెప్తున్నారు. గ్రూప్-1 పోస్టులు, డీఎస్సీ పోస్టులు పెంచటం సాధ్యమైనప్పుడు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచటం ఎందుకు సాధ్యం కాదు? అన్నది నిపుణులు, నిరుద్యోగుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. జీవో 46ను రద్దు చేయటం, గురుకుల పోస్టు ల్లో రిలింగ్విష్మెంట్ను అమలు చేయటం, జాబ్ క్యాలెండర్ ప్రకటించటం, నిరుద్యోగ భృతి 4 వేలు ఇవ్వడం వంటివన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.
డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18న మొదలై ఆగస్టు 5వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత రెండు రోజులకే.. అంటే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ రాశాక గ్రూప్-2కు సిద్ధం కావడానికి కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలన్నది నిరుద్యోగుల అభ్యర్థన. అక్టోబర్లో గ్రూప్-1 మెయిన్స్, నవంబర్లో గ్రూప్-3 పరీక్షలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. గ్రూప్-2ను కనీసం డిసెంబర్ వరకు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
పోలీసుల సాయంతో ఉక్కుపాదం
ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అండ గా ఉంటామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. యూనివర్సిటీలు, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇందిరాపార్క్.. ఇలా నిరుద్యోగులు ఎక్కడ నిరసన తెలిపినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.