పింఛన్ రూ.4వేలకు పెంచకపోవడం, పెన్షన్ను సమయానికి ఇవ్వకపోవడంపై పండుటాకులు రోడ్డెక్కారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పాతబస్టాండ్ సమీపంలో వృద్ధులు రాస్తారోకో చేపట్టారు. ధర్నాతో వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పింఛన్ సమయానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా మొదటివారంలో అందేదని వారు గుర్తుచేసుకున్నారు.
ఖైరతాబాద్, జూన్ 25: చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల సొమ్ము ను బకాయిలతో సహా జూలై 2లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేకుంటే మూడు నుంచే ఉద్యమ కార్యాచరణ రూ పొందిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలిసి పోరాటానికి దిగుతామని, ఉద్యమంలో భాగస్వాములు కావాలని బీజేపీ, సీపీఐ, సీపీఎంనూ ఆహ్వానిస్తామని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఏడు నెలల కాలంలో నెలకు రూ.896 కోట్ల చొప్పున సుమారు రూ.6,300 కోట్ల చేయూత పింఛన్ల సొమ్మును ప్రభు త్వం బకాయి పడిందని తేల్చిచెప్పారు. ఎగ్గొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దివ్యాంగులను మోసగించిన ఘన త కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఎద్దేవాచేశారు. పింఛన్ల సొమ్మును ప్రభు త్వం పెంచకుంటే జూలై 3న హైదరాబాద్లో, 4న అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీలతో రౌండ్టేబుల్ సమావేశాలు ఏర్పా టు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంను కలుపుకొని పోతామని, అదేరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి స్వయంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని తాను కోరుతానని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావును కలిసి భవిష్యత్తు ఉద్యమానికి ఆహ్వానిస్తామని చెప్పారు. 5న కలెక్టరేట్ల ఎదుట వేలాది మందితో మహా ధర్నాలు, 6 నుంచి 16 వరకు కలెక్టరేట్ల ఎదుట దీక్షలకు దిగుతామని చెప్పారు. 17 నుంచి 31వరకు అన్ని మండలాల్లో దీక్షలు, ధర్నాలతో రోడ్ల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.