దరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు కూడా చెల్లించడంలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ వేతనాల చెల్లింపులు బంద్ అయ్యాయని ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవవేతనాలు రూ.100 కోట్లకు పైనే ఉంటాయని చెప్తున్నారు.
సర్పంచ్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), మండల ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక సభ్యులు (జడ్పీటీసీ సభ్యులు) గౌరవ వేతనాలు చెల్లించడంలేదని, తమ పదవీ కాలం కూడా పూర్తయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు నెలకు రూ.13 వేల చొప్పున చెల్లిస్తున్నారు.
రాష్ట్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు 539 మంది చొప్పున ఉన్నారు. ఎంపీటీసీలు 5,817 మంది, సర్పంచ్లు 12,769 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.6,500 చొప్పున ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలకు నిధులు విడుదల చేయలేదు. ఇటీవల పదవీకాలం ముగిసిన సందర్భంగా చేస్తున్న సన్మానాల కార్యక్రమంలో తమకు గౌరవ వేతనాలు ఇప్పించాలని కార్యక్రమానికి హాజరవుతున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను వేడుకుంటున్నారు.