Current Bills | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూ రో జూలై 1 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు వినియోగదారులు ఇకపై బ్యాంకింగ్ యాప్లతోపాటు పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, అమెజాన్పే లాంటి థర్డ్పార్టీ యాప్ల నుంచి బిల్లులు చెల్లించడం కుదరదు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు ఇలాంటి థర్డ్పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బిల్లులు చెల్లించడాన్ని జూలై 1 నుంచి నిలిపివేసినట్టు రాష్ట్ర విద్యుత్తు శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపై వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే బిల్లులు చెల్లించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ స్పష్టం చేశారు. ఈఆర్వో కార్యాలయాల్లోనూ విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు తెలిపారు.
మీరు 1 సరిగా నొక్కలేదు!
డయల్ 100 పని చేయలేదన్న ఓ నెటిజన్ పోస్టుకు టీఎస్కాప్ వివరణ
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కావేరి ట్రావెల్స్ బస్సు నడిపే డ్రైవర్లు, క్లీనర్ ఫుల్లుగా మద్యం తాగి బస్సు నడుపుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మా పై దౌర్జన్యం చేశారు. కనీసం మీరైనా పట్టించుకోండి’ అంటూ ధీరజ్రెడ్డి డయల్ 100 కు కాల్ చేయటంతో సరైన స్పందన లభించలేదు. దీంతో ధీరజ్రెడ్డి బాధనంతా ‘ఎక్స్’లో వెల్లగక్కారు. డీజీపీ, తెలంగాణ కాప్స్, రాచకొండ, సైబరాబాద్ సీపీలను ట్యాగ్ చేస్తూ ఆవేదన వెలిబుచ్చారు. స్పందించిన ‘తెలంగాణ కాప్స్’.. ‘మీరు ఐవీఆర్ సిస్టమ్లో 1ని సరిగా నొక్కలేదు. దీంతో కాల్ డ్రాప్ చేశాం’ అని సమాధానం ఇచ్చింది. ‘రెండోసారి కాల్ చేసి.. 10 సెకన్ల తర్వాత ఐవీఆర్లో 1 నొక్కారు. కాల్ బదిలీ చేస్తుండగానే డిస్కనెక్ట్ చేశారు’ అని వివరణ ఇచ్చింది. ఈ సమాధానంపై నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడ్డారు.