ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2: ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. 9 రోజులుగా గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మోతీలాల్ తన దీక్షను విరమించడంతో, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తానే దీక్ష చేస్తానని అశోక్ ప్రకటించారు. అనంతరం ఓయూకు వస్తాడనే సమాచారంతో ఆర్ట్స్ కళాశాల ఆవరణను పోలీసుల వలయంగా మార్చివేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకొన్న అశోక్ కారు దిగగానే పోలీసులు చుట్టుముట్టి దీక్షకు అనుమతి లేదంటూ అరెస్టు చేసి, చైతన్యపురి పోలీస్స్టేషన్కు తరలించారు.
ప్రస్తుతం ఆయన దీక్ష కొనసాగిస్తున్నట్టు సమాచారం. అయితే అశోక్ అరెస్టు ఘటనపై ఉస్మానియాలో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినదించారు. పోలీసు నిర్బంధంతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. నిరుద్యోగ వాదం ఎత్తుకొని, నిరుద్యోగులను మోసం చేసి, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ పదవులు అనుభవిస్తున్న బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న దీనికి నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రొఫెసర్ కోదండరాం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఓయూ వేదికగా వేలాది మందితో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆయనను హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆయన తన ఇంటి నుంచే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిరహార దీక్ష చేస్తున్న ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలని, గ్రూప్-2, గ్రూప్-3లో పోస్టుల సంఖ్య పెంచాలని, డీఎస్సీ పరీక్షను వాయిదా వేసి, మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని జడ్సన్ స్పష్టం చేశారు.