KTR | సిద్దిపేట/ వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు రకరకాల కారణాలతో నెత్తురు పారిన తెలంగాణలో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. పొలాలకు సాగునీళ్లు పారుతున్నాయని, ఇంటిముందు నల్లా విప్పితే తాగునీళ్లు పారుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని, దీన్ని ముందుకు తీసుకుపోవాలని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అశాంతి రాజేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రూ.33.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం డిపో గ్రౌండ్లో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశ్వీరాద
మొదటిపేజీ తరువాయి…
సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ రమణతో కలిసి పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ జిల్లాకు చేరుకొన్న ఆయన, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన కాజీపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగసభలో ప్రసంగించారు. రెండు జిల్లాల్లోనూ కేటీఆర్ సభలకు వేలమంది తండోపతండాలుగా తరలివచ్చారు. తమ ప్రియతమ నేతను చూడగానే కేరింతలు కొట్టారు. కేటీఆర్ పర్యటన ఆసాంతం జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో మార్మోగిపోయింది.
చిల్లరగాండ్ల సొల్లు మాటలు నమ్మొద్దు
నిత్యం అబద్ధాలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ చిల్లరగాండ్ల మాటలు నమ్మవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. ‘కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమంతో స్వరాష్ట్రం సాధించుకొన్న తర్వాత ప్రజల ఆశీర్వాదంతో రెండు టర్ములు వరుసగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా పని చేసుకొంటున్నం. ఎన్నికలు వస్తున్నయంటే సంక్రాతికి గంగిరెద్దులు వచ్చినట్టు బీజేపోళ్లు, కాంగ్రెసోళ్లు వచ్చి ప్రజలను అయోమయానికి గురిచేసేలా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మాయమాటలు చెప్తారు. గోల్మాల్ గోవిందం కార్యమ్రం మళ్లీ మొదలు పెట్టారు. నిన్నగాక మొన్న ఇదే ఓరుగల్లు గడ్డమీద ఒక దుర్మార్గుడు, చిల్లరమల్లర బీజేపీ నాయకుడు ఇంకో చిల్లరగానితో తోడై ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పదో తరగతి పరీక్ష పేపర్ను అక్రమంగా బయటకు తెచ్చి లీకైందని తప్పుడు ప్రచారం చేసిండు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు ఇక్కడొక నాయకుడు పేపర్ లీక్ చేసిండు. పోలీసులు వెంటనే పట్టుకొని ఈపు పగలగొట్టి లోపలేసిండ్రు. ఈ వెధవ పనికి పూనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నువ్వుగూడా విచారణకు రా అని నోటీసులు ఇచ్చిండ్రు. ఆయన పోలీసుల దగ్గరకు రాకపోగా పేపర్ లీక్ చేసిన దుర్మార్గుడు బెయిల్ మీద బైటికి వస్తే స్వాతంత్ర సమరయోధుడు వచ్చినట్టు దండలు వేసి, శాలువలు కప్పిండ్రు. ఇలాంటి వాళ్లకు సన్మానం చేసే నీచమైన పార్టీ ఒక్క బీజేపీ మాత్రమే. దమ్ముంటే పనులు చేయటంలో పోటీ పడాలి. అందరూ ఆలోచించండి. ఒక్కసారి దొంగలను పట్టంగనే లీకేజీలు బంద్ అయినయ్. భావ దారిద్య్రపు పార్టీ బీజేపీ. రానురాను కుట్రలు ఇంకా పెరుగుతయ్’ అని హెచ్చరించారు.
నెత్తురు పారించేందుకు బీజేపీ కుట్ర
ప్రశాంతమైన తెలంగాణలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ‘2014కు ముందు ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తరు పారింది. నక్సలిజం సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు.. నెత్తురు పారిన ఈ నేల మీద ఇప్పుడిప్పుడే నీళ్లు పారుతున్నయ్. బీజేపీ ఆలోచన ఒకటే.. తెలంగాణలో నీళ్లు వస్తే ఆ పార్టీ కిందికి నీళ్లు వస్తయ్. తెలంగాణలో నెత్తురు పారించాలనేదే ఆ పార్టీ కుట్ర. చైతన్యానికి ప్రతీక అయిన ఓరుగల్లు ఆలోచించాలె. మనకు పచ్చని పంటల తెలంగాణ కావాల్నా? మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాల్నా? నెత్తురు పారుతున్న తెలంగాణ కావాల్నా? నీళ్లు పారుతున్న పచ్చని బంగారం లాంటి తెలంగాణ కావాల్నా? అందరూ ఆలోచించాలె’ అని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక వరంగల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, తెలంగాణలోనే అతిపెద్ద గవర్నమెంటు దవాఖాన వరంగల్లోనే నిర్మాణమవుతున్నదని తెలిపారు. రూ.1,116 కోట్లతో 24 అంతస్తులతో హెల్త్ సిటీ బ్రహాండంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని విమర్శించారు.
‘బీజేపీకి సిగ్గు, ఇజ్జత్, మానం ఉంటే సమాధానం చెప్పాలె. పార్లమెంటులో చేసిన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినా కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు కట్టడం లేదని అడిగితే దేశంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని పార్లమెంటులో మంత్రి సమాధానం ఇచ్చిండు. అదే ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.20 వేల కోట్లతో కొత్తగా కోచ్ ఫ్యాక్టరీ కడుతున్నరు. చట్టంలో పెట్టిన మాటకు తూట్లు పెట్టి, చట్టాన్ని వారి చుట్టంగా మార్చుకుని గుజరాత్కు ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇస్తమని చట్టంలో పెట్టిండు. మన జాగ ఇచ్చినం.
గిరిజన యూనివర్సిటీ ఏమైందని అంటే మెమెమ్మే.. బెబ్బెబ్బే. ఇక్కడి వచ్చి మాత్రం తెలంగాణను ఉద్దరించినట్టు డైలాగులు కొడ్తున్నరు. మీకు నిజంగా వరంగల్ ప్రజల ఆశీర్వాదం కావాలంటే ఇక్కడి ప్రజలకు, ఈ నగరానికి ఏం చేసిండ్రో చెప్పాలి’ అని సవాల్ చేశారు. దేశాన్ని దోచి దోస్తును కుబేరుడిని చేయటమే ప్రధాని మోదీ లక్ష్యమని కేటీఆర్ విమర్శించారు. ఆ దోస్తు ఇచ్చే పైసలతో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలుస్తున్నారని ఆరోపించారు. ఎదైనా చేసి దేశంలో నియంతృత్వ పాలన తేవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎంపీగా బండి సంజయ్ ఏం చేసిండో చెప్పే దమ్ముందా?
వినోద్కుమార్ లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని ఒక పిచ్చోన్ని తెచ్చి పెట్టుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో తెలియదని.. ఎవరు మీ ఎంపీ అంటే చెప్పుకోవటానికి ఇజ్జత్ అనిపిస్తున్నదని పేర్కొన్నారు. ‘మసీదులు తవ్వేటందుకా ఈయన్ని గెలిపించింది? దేవుడన్నా.. మోదీ దేవుడు అంటాడు. ఎవడికి దేవుడు, ఎక్కడి దేవుడు? వంటగ్యాస్ ధరను రూ.1,200 చేసినోడు దేవుడా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇయ్యాల ఉద్యోగాలు ఏవి మోదీ అంటే పకోడీలు వేసుకొమ్మని చెప్పినందుకు దేవుడా? పెట్రోల్ ధరలు పెంచి రైతులకు కష్టాలు తెచ్చినోడు, 700 మంది రైతులను చంపినోడు దేవుడా? దేశం నిండా మతం పేరిట చిచ్చు పెట్టి, పిల్లల మనస్సులో విషం నింపుతున్నోడు దేవుడా?’ అని ప్రశ్నించారు. ఏంపీగా నాలుగన్నరేండ్లలో కరీంనగర్కు బుడ్డ పైసా అయినా తెచ్చావా? అని బండిని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వినోద్కుమార్ అన్న, ఎమ్మెల్యేగా సతీశ్ అన్నను లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓట్లు అడగడానికి కాంగ్రెస్కు సిగ్గుండాలి
కాంగ్రెస్ వాళ్లను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నారని, 75 ఏండ్లలో కాంగ్రెస్కు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. నిన్నమొన్నటి దాకా ప్రజలను ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఒక్క చాన్స్ ఇవ్వండి అని మళ్లీ ఎలా వస్తున్నారని విమర్శించారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్కు తగిన బుద్ధ్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ వచ్చాక ఆడబిడ్డల గోస తీరింది…
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణలో ఆడబిడ్డల కష్టాలు తీరాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్లో ఎైట్లెతే నీళ్లు వస్తున్నాయో.. తమ బంజారా తండాల్లో కూడా అలాగే వస్తున్నాయని గిరిజన ఆడబిడ్డలు సంతోషంగా చెప్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక గోస తప్పిందని సంతోషిస్తున్నారని తెలిపారు. దేశంలో ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ‘రాష్ట్రంలో హనుమంతుడి గుడిలేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది ఒట్టి మాట కాదు.. పూర్తిగా లెక్కలు చూసి చెప్తున్నా. పురాణకాలంలో భగీరథుడు గంగను భూమికి తెస్తే.. నేడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా నీళ్లను పైకి మళ్లించి అపర భగీరథుడు అయ్యారని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు, కుట్రలు చేసినా నాలుగేండ్లలో పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రాజెక్టులను పూర్తిచేసి ఇవాళ మండుటెండల్లో చెరువుల్లోకి గోదావరి జలాలను నింపి, ఆ జలాలతో రైతుల కాళ్లు కడిగిన మన నాయకుడు సీఎం కేసీఆర్ అని శ్లాఘించారు.
వినయ్భాస్కర్ను 70 వేల మెజారిటీతో గెలిపించండి
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కేటీఆర్ కోరారు. ‘అందరికీ ఆప్తులు, అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే, నేనున్నా అంటూ టక్కున పలకరించే నాయకుడు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్. హనుమకొండ నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనది. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గానికి పరిమితం చేయకుండా జిల్లా మొత్తం తిరిగేలా అవకాశం ఇవ్వాలని వినయ్భాస్కర్ కోరారు. వారికి ఇక్కడి ప్రజలు ఆ అవకాశం ఇయ్యాలి. గత ఎన్నికల్లో వినయ్భాస్కర్కు 37 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో రెట్టింపు మెజారిటీతో అంటే 70 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిపించుకోవాలి. ఆయనను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి’ అని కోరారు.
లక్ష ఓట్లతో సతీశన్నను గెలిపించండి
2014లో ఎమ్మెల్యే సతీశ్ను 33 వేల ఓట్లతో గెలిపించారని, 2018లో 75 వేల ఓట్లతో గెలిపించారని ..ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్షా ఆరువేల ఎకరాలకు సాగు నీరు అందించి రైతుల కష్టాలు తీర్చినందుకు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. మంత్రి పిలుపునకు ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతును తెలియజేశారు. హుస్నాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని, దానిని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.
సమావేశాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఒడితెల సతీశ్కుమార్, నన్నపనేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ చైర్మన్లు కే వాసుదేవరెడ్డి, మెట్టు శ్రీనివాస్, కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పార్టీ నేతలు పుల్లా పద్మావతి, పులి రజినీకాంత్, నయీమొద్దీన్, దర్శన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్కు 2 వేల ఐటీ ఉద్యోగాలు
వరంగల్కు గొప్ప చారిత్రక వారసత్వమే కాకుండా ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం కొత్తగా నాలుగు కంపెనీల కేంద్రాలను ప్రారంభించారు. జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్, హెక్సాడ్, ఎల్అండ్టీ-మైండ్ ట్రీ క్యాంపస్లను ఆయన ప్రారంభించారు. వీటిల్లో కొత్తగా 2 వేల ఐటీ ఉద్యోగాలు రానున్నట్టు చెప్పారు. వరంగల్లో ఇప్పటికే టెక్ మహీంద్రా, సైయంట్, సాఫ్ట్పాత్ కంపెనీలున్నాయి. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో రూ.70 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సైన్స్పార్కును పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ‘మీకు మంచి భవిష్యత్ ఉంటుంది, కొత్తగా ఆలోచించి కనిపెట్టాలి, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి’ అని విద్యార్థులకు మంత్రి సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ఇందిరానగర్, సాయినగర్ వాసులకు ఇండ్ల పట్టాలు అందజేశారు.
బీఆర్ఎస్ను వీడను: వినయ్భాస్కర్
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో వరంగల్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయింది పదవి కోసం, దర్పం కోసం కాదని, తన నియోజకవర్గ ప్రజల కోసమన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిబద్ధతతో చేశానని పేర్కొన్నారు. జిల్లాకు మరిన్ని ఐటీ కంపెనీలు త్వరలో రానున్నాయని, మరుగునపడ్డ దేవాలయాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తున్నదని తెలిపారు. రూ.30 కోట్లతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి మాడ వీధులు నిర్మిస్తామని చెప్పారు. మూడువేల గజాల్లో రూ.60 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నట్టు తెలిపారు.
కేటీఆర్కు నీరాజనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్వకుంట్ల తారకరామారావు గారు.. కాగడాలాంటి కాంతులు మీరు.. అని ఓ యువతి మంత్రి కేటీఆర్ గుణగణాలను కీర్తిస్తూ ఉన్న చిత్రపటాన్ని ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకుంది.. ఇది రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై వెల్లువెత్తిన ప్రజాభిమానానికి నిదర్శనం. శుక్రవారం మంత్రి వరంగల్ జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాలకు జనప్రభంజనం వెల్లువలా తరలివచ్చింది. ఊరూరా అపూర్వ ఆదరణ లభించింది. మా ఆశ.. మా శ్వాస మీరే.. అంటూ యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు సైతం కేటీఆర్పై తమ అభిమానం చాటుకున్నారు. చిన్నారి విద్యార్థుల నడుమ కూర్చొని కేటీఆర్ ముచ్చట్లాడారు. మహిళలతో కరచాలనం చేస్తూ, యువకులతో బ్యాడ్మింటన్ ఆడుతూ, లంబాడీ మహిళలతో ఫొటోలు దిగుతూ కేటీఆర్ సందడి చేశారు. వరంగల్లో విద్యార్థుల ఇన్నోవేషన్కు భరోసా కల్పించారు.
మంత్రిని కలిసిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకుంటూ జనం నీరాజనం పలికారు. పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ జనానికి స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ భరోసా కల్పించారు. సభలో ఒక్కో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం గురించి చెప్పినప్పుడల్లా జనం పిడికిలెత్తి మద్దతు తెలిపారు. ఆయా సభల్లో మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. రాష్ట్రంలో బీజేపీ నేతల తిరోగమన వైఖరిని కేటీఆర్ గట్టిగా ఎండగట్టారు. ప్రజలకు మేలు చేసే బీఆర్ఎస్ కావాలా? కీడు చేసే బీజేపీ కావాలా? అన్నప్పుడు జనం బీఆర్ఎస్ అంటూ గట్టిగా చప్పట్లతో మద్దతు పలికారు. పచ్చని తెలంగాణ కావాలా? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలా? అంటే పచ్చని తెలంగాణే కా వాలంటూ జనం నినదించారు. హుస్నాబాద్లో కేటీఆర్ వెళ్తున్న సమయంలో శ్రేణులంతా ఒక్కసారిగా తమ ఆప్తుడిగా సాగనంపుతూ చేతులెత్తి వీడ్కోలు పలికిన సమయం మరువలేనిది.