Tribal Welfare | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్లోని ‘హోటల్ ది ప్లాజా’లో జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ ఆధ్వర్యంలో శాఖ అధికారులు తమ విభాగాలు చేపడుతున్న వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై కమిషన్కు వివరించారు.
కమిషన్ సభ్యులు గిరిజన సంక్షేమ శాఖలోని విద్య, మౌలిక వసతుల కల్పన, ట్రైకార్, జీసీసీ, సంస్కృతి తదితర విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న ఆయా పథకాల పురోగతిని గురించి సంబంధిత అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా పురోగతులపై అధికారులను అభినందించారు. ఇంకా ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలని పలు సూచనలు చేశారు.
సమావేశంలో గురుకులం కార్యదర్శి సీతాలక్ష్మి, గిరిజన శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, ట్రైకార్ జీఎం శంకర్, జీసీసీ జీఎం సీతారాం, గిరిజన పరిశోధన సంస్థ సంయుక్త సంచాలకులు డాక్టర్ వీ సముజ్వల, డాక్టర్ డీ సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులు, పలు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.