గోవిందరావుపేట/వెల్దండ, జూన్ 29 : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జాతీయ రహదారిపై శనివారం పాల ఉత్పత్తిదారులు రాస్తారోకో నిర్వహించారు. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలకు చెందిన పాల ఉత్పత్తిదారులు పస్రాకు చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకు డు సూరపనేని వెంకటసురేశ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాల ఉత్పత్తిదారులు రైతులకు ప్రభుత్వ ధర కంటే ఎక్కువ చెల్లిస్తున్నా పట్టించుకోకుండా, విజయ డెయిరీకి విక్రయిస్తున్నట్టు తెలిపారు.
బీఆర్ఎస్ సర్కార్ 15 రోజులకోసారి బి ల్లులు చెల్లించేదని, పాల ఉత్పత్తిదారుల బాధలను చూసి లీటరుకు రూ.4 బోనస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రెండు నెలలు కావొస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నట్టు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలోని పాల కేంద్రం వద్ద రైతులు పాల క్యాన్లతో నిరసన తెలిపారు.
మున్సిపల్ గది దాటని బతుకమ్మ చీరలు
బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో మహిళలకు అందించేందుకు బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ పంపిణీ చేయకపోవడంతో మున్సిపల్ కార్యాలయం రెండో అంతస్తులోని ఓ గదిలో పేరుకుపోయాయి.
గత బతుకమ్మ వేడుక సమయంలో మున్సిపల్ కార్యాలయానికి 16,490 చీరలు వచ్చాయి. అరకొర మాత్రమే పంపిణీ చేసి మిగితా వాటిని గదిలో నిల్వ ఉంచారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ స్పందిస్తూ.. గతేడాది బతుకమ్మ సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ చేయలేదని తెలిపారు. వీటిని జిల్లా కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. – వేములవాడ
మేడిగడ్డకు వరద పోటు
మహదేవపూర్, జూన్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్కు వరద పోటెత్తుతున్నది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 8,790 క్యూసెక్కులు , శనివారం 12 వేల క్యూసెక్కులుగా ఉన్నది. అంతేమొత్తంలో వరదను నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
భారీ వరదల కారణంగా ఏడో బ్లాక్ వద్ద సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు చేపట్టిన పరిశోధనలు నిలిపోయాయి. పనులకు వినియోగించే భారీ యంత్రాలను ఒడ్డుకు చేర్చారు. బరాజ్లో 85 గేట్లను ఎత్తేశారు. వరద ప్రవాహ తీరును భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పరిశీలించారు.