మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయంపై రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితం బీజేపీపై బీఆర్ఎస్ సాధించిన తొలి విజయమని, భవిష్యత్తులో బీజేపీపై పోరాటానికి ఈ విజయం నాంది పలికిందని అభివర్ణించారాయన. ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య పోరాటంలా కాకుండా అమిత్ షా వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగానే జరిగిందన్నారు. బీజేపీతో పాటు ఈడీ, ఐటీ, సీబీఐ కలిసి వచ్చినా.. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉందని ప్రజలు తేల్చి చెప్పారన్నారు. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు వచ్చి హడావుడి చేసినా… బీజేపీ ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం టిఆర్ఎస్ వైపే ఉన్నామని స్పష్టమైన తీర్పునిచ్చారని సతీష్ రెడ్డి అన్నారు.
బీజేపీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం తమ మంచికోరే నాయకుడు కేసీఆర్కే జై కొట్టారన్నారు సతీష్ రెడ్డి. టీఆర్ఎస్కే పట్టం కట్టారని, రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలనుకున్న బీజేపీకి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారని సతీష్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొవాలన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న.. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు సన్యాసం తీసుకోబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విజయం జాతీయ పార్టీ బీఆర్ఎస్కు మునుగోడు ప్రజలు ఇచ్చిన బహుమానమన్నారు. దేశంలోనూ తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాల్ని అమలు చేయాలని ప్రజలు ఆశీర్వదించి పంపిస్తున్నారని పేర్కొన్న సతీష్ రెడ్డి టీఆర్ఎస్కు విజయాన్ని అందించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.