Telangana Cabinet | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శ, వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం దక్షిణ తెలంగాణవారిదే ఆధిపత్యం కాగా, ఉత్తర తెలంగాణవారికి నామమాత్రపు శాఖలు దక్కినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. తాజా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపులోనైనా ఉత్తర తెలంగాణవారికి అవకాశం దక్కుతుందా? అని ఆ ప్రాంత నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ వంటి కీలక పదవులు, కీలక శాఖలు దక్షిణ తెలంగాణకు చెందిన నాయకులకే దక్కాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్తోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు కూడా ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లేకుండాపోయింది. త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలోనైనా ఈ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం లభిస్తుందా?, పీసీసీ పీఠం అయినా ఇస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్యను బట్టి 18 మందికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుండగా.. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. అయితే నాలుగింటిని మాత్రమే భర్తీ చేయాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నట్టు తాజా సమాచారం. ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం పదవులతోపాటు కీలక శాఖలన్నీ దక్షిణ తెలంగాణకే దక్కాయన్నది ఉత్తర తెలంగాణ నేతల ఆరోపణ. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉత్తర తెలంగాణకు ప్రభుత్వంలో పెద్ద పీట వేశారని వారు గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడెందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమకు ప్రాధాన్యం లభించడం లేదని వాపోతున్నారు.
ప్రస్తుత మంత్రిమండలిలో దక్షిణ తెలంగాణ నుంచి సీఎం రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఉత్తర తెలంగాణ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాధారణ పరిపాలన, శాంతి-భద్రతలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తోపాటు ఇతరులకు కేటాయించని శాఖలన్నింటినీ నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక శాఖలను కేటాయించగా, ఉత్తమ్కుమార్రెడ్డికి ఇరిగేషన్, ఆహార, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖలను కేటాయించగా, దామోదర రాజనరసింహకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. తుమ్మల నాగేశ్వర్రావుకు వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలను కేటాయించగా, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖలు కేటాయించారు.
ఉత్తర తెలంగాణకు చెందిన శ్రీధర్బాబు, సీతక్కకు గుడ్డిలో మెల్లగా కాస్త ప్రాధాన్యం కలిగిన శాఖలు కేటాయించగా, మిగతా ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్కు ప్రాధాన్యంలేని శాఖలు దక్కాయి. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖలు, సీతక్కకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం శాఖలు కేటాయించగా, కొండా సురేఖకు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలు, పొన్నం ప్రభాకర్కు ట్రాన్స్పోర్టు, బీసీ సంక్షేమం శాఖలు కేటాయించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో చెన్నూర్ నుంచి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, ఖనాపూర్ నుంచి వెడ్మ బొజ్జ, మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్రావు నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో వివేక్ వెంకటస్వామి గతంలో ఎంపీగా, వినోద్ మంత్రిగా, ప్రేమ్సాగర్రావు ఎమ్మెల్సీగా పనిచేసిన సీనియర్ నాయకులు. వీరిలో వెడ్మ బొజ్జ మాత్రమే మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే. కానీ ఈ జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. వివేక్, వినోద్ దివంగత జీ వెంకటస్వామి కుమారులు. వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి పదవులు ఉన్నాయన్న కారణంగా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని చెప్తున్నారు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీని కష్టకాలంలోనూ కాపాడుకుంటూ వచ్చిన సీనియర్ నాయకుడు ప్రేమ్సాగర్రావుకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కేవలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రేమ్సాగర్రావు సన్నిహితుడన్న కారణంతోనే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇక్కడి నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో బోధన్ నుంచి మాజీ మంత్రి పీ సుదర్శన్రెడ్డి, జుక్కల్ నుంచి టీ లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్రావు, నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్ భూపతిరెడ్డి ఉన్నారు. ఈ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి గతంలో ఇరిగేషన్ వంటి కీలక శాఖ నిర్వహించినప్పటికీ మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పట్ల ఆ జిల్లాలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం మంత్రివర్గ విస్తరణలో అయినా ఈ సీనియర్ నేతకు చోటు లభిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
కనీసం పీసీసీ అధ్యక్ష పదవి అయినా ఉత్తర తెలంగాణకు దక్కుతుందా? అని ఆ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు మొదటి నుంచీ ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణకు కనీసం పార్టీ పదవిలోనైనా ప్రాధాన్యం కల్పిస్తారా? లేదా? అన్నది త్వరలో తేలనున్నది.