Rain Update | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపరితలగాలులు వీస్తున్నాయని, గురువారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.
దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ-గద్వాల, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని చెప్పారు.
వర్షంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో భారీగా ఈదరుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు,మెరుపులతో పాటు పిడుగులు పడొచ్చునని, ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరించారు. జూలై 6 తర్వాత రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతాయని, జూలై 2వ వారంలో ఈశాన్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయిలో అత్యధికంగా 7.13 సెం.మీ వర్షపాతం నమోదైంది.