భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం/అశ్వారావుపేట/ ములకలపల్లి, జూన్ 30: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ప్రారంభమైన వాన ఆదివారం రాత్రి దాటినా ధార తెగకుండా కురుస్తూనే ఉంది. కొన్ని మండలాల్లో తేలికపాటి, మరికొన్ని మండలాల్లో మోస్తరు, ఇంకొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటున 32 మిల్లీ మీటర్ల వర్షపాతం, భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో 39 డిగ్రీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో పత్తి, పునాస పంటలు ప్రాణం పోసుకుంటున్నాయి.
మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో జనజీవనానికి కాస్త ఆటంకం ఏర్పడింది. ఆయా పనుల మీద బయటకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో ఆదివారం ఉదయం భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలింది. వైరాజగ్గయ్యపేట మార్గంలో కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
కొట్టుకుపోయిన అప్రోజ్ నిర్మాణం
ములకలపల్లి మండలం తాళ్లపాయి పంచాయతీ పరిధిలో రింగిరెడ్డిపల్లి మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రోడ్డుపై పాములేరు వాగు మీద వంతెన నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. అప్పటికే ఉన్న బ్రిడ్జిని కాంట్రాక్టర్ తొలిగించి రాకపోకలకు అంతరాయం కలుగకుండా తాత్కాలికంగా అప్రోచ్ నిర్మించారు. ఇటీవల ములకలపల్లిలో కురిసిన వర్షానికి అప్రోచ్ కొట్టుకుపోయింది. దీంతో రింగెరెడ్డిపల్లి, తాళ్లపాయి, మంగళిగుట్ట, సుందర్నగర్ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది.