హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ పోరాటం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేసిన మోతీలాల్ను తాను సెంట్రల్ యూనివర్సిటీలో కలిసి వచ్చినట్టుగా ఆమె తెలిపారు.
మోతీలాల్ దీక్ష వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందని చెప్పారు. దీంతో ఎవరినీ కలవకుండా మోతీలాల్ను ఇబ్బంది పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఇప్పుడిప్పుడే గిరిజన బిడ్డలు తెలుసుకుంటున్నారని వివరించారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేకుంటే తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.