మహబూబాబాద్, ఆగష్టు 22 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ(Loan waiver) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) నాటకం ఆడుతుందని.. రైతులకు రుణమాఫీ చేశామని బూటకపు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మానుకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రైతులందరికి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఒకమాట.. ఎన్నికల తరువాత ఒక మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కోసం రూ.45వేల కోట్లు అని చెప్పి ఇప్పుడు కేవలం రూ.17వేల కోట్లే మాఫీ చేసి, మిగిలిన చాలమంది రైతులకు అన్యాయం చేశారని చెప్పారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతు ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు రైతులకు మాటిచ్చారు.
అన్న ప్రకారం రైతులందరికి రుణమాఫీ చేయని సీఎం రేవంత్రెడ్డి ముందుగా రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మెన్ మార్నేని వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీరెల్లి భరత్కుమార్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.