న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఈడీ ఉల్లంఘించిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లాయర్ విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హామీని ఉల్లంఘించి అరెస్టు చేశారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ స్పెషల్ జడ్జీ ఎంకే నాగ్పాల్ ముందు ఎమ్మెల్సీ కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి, మోహిత్ రావు, ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్, ఎన్కే మట్టా వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని విక్రమ్ చౌదరి న్యాయమూర్తికి తెలిపారు. 2023, సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని, కవితను అరెస్టు చేయబోమని చెప్పారని వెల్లడించారు. అదే నెల 26న మరోసారి వాదనలు జరిగాయని, ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని తెలిపారు.
సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో ఒక అప్లికేషన్ వేస్తామని చెప్పారు. సుప్రీంలో మౌఖికంగా చెప్పిన మాటను ఈడీ ఉల్లంఘించదన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని చెప్పారు. అయినా కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈడీ అడిగినప్పుడల్లా కవిత విచారణకు హాజరయ్యారని వెల్లడించారు. కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమన్లు జారీచేశారన్నారు. కవిత పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంను కోరారని వెల్లడించారు. కవితకు ఇచ్చిన రిలీఫ్ ఇంకా అమల్లో ఉందన్నారు. నళిని చిదంబరంకి ఇచ్చిన రిలీఫ్ కవితకు ఇవ్వాలని కోరామన్నారు. దీనిపై శుక్రవారం వాదనలు జరిగాయన్నారు. లైవ్లో ఉన్న వాదనలను దేశమంతా చదివారని చెప్పారు. కేసును 19న విచారిస్తామని సుప్రీం కోర్టు జడ్జి చెప్పారన్నారు.
‘ఆ తర్వాత కొద్దిసేపటికే కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 160 సెక్షన్ కింద సీబీఐ 8 గంటలపాటు విచారించింది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ఉంది. అప్పటి వరకు ఈ కేసు విచారణ ఇక్కడ నిలుపుదల చేయాలి. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వండి’ అంటూ కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు.
అంతకుముందు కవితతో మాట్లాడేందుకు 5 నిమిషాలు సమయం కావాలని విక్రమ్ చౌదరి కోరారు. అందుకు జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి తనను న్యాయవాదులతో మాట్లాడనివ్వలేదని న్యాయమూర్తికి దృష్టికి కవిత తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు తీసుకొస్తామని 11 గంటలకు తెచ్చారని అన్నారు.
కాగా, ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ.. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. మీడియాలో వచ్చిన విషయాలను పరిగణలోకి తీసుకోవద్దన్నారు. సెప్టెంబర్ 15న వచ్చే 10 రోజుల్లో సమన్లు ఇవ్వం అని మాత్రమే చెప్పామన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పారు. ఒక్క ఆర్డర్ అనుకూలంగా ఉంటే.. దానిని నిరవధిక కాలానికి అన్వయించుకోవద్దు. వేరేవారికి ఇచ్చిన ఉత్తర్వులను అన్వయించుకోవద్దని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వును మొత్తానికి వర్చించుకోవడం మంచిది కాదన్నారు.
సుప్రీంలో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకి రాదని చెప్పారు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు లేవన్నారు. కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని వెల్లడించారు. సుప్రీం కోర్టులో చెప్పిన 10 రోజుల గడువు ఎప్పుడో తీరింది. తర్వాత ఎన్నోసార్లు కోర్టులో విచారణ జరిగిందని చెప్పారు. సెప్టెంబర్ 15న ఇచ్చిన అండ్ టేకింగ్నే ప్రస్తావిస్తూ ఉన్నారు. కవిత దాఖలు చేసిన మధ్యంతర ఉత్తర్వులు లేవని చెప్పారు. నళినీ చిదంబరం కేసులో ఇచ్చిన ఉత్తర్వులనే అన్వయించుకుంటున్నారని, మీడియాలోని వార్తలనే పరిగణనలోకి తీసుకోవాలంటున్నారని చెప్పారు. అదే మీడియాలో కవితకు వ్యతిరేకంగా అనేక కథనాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో సీఆర్పీసీ సెక్షన్లు ఇప్పుడు వర్తించవన్నారు.