నాగర్కర్నూల్ దవాఖానలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను శనివారం పరామర్శించి రూ. 1.5 లక్షల ఆర్థికసాయం అందిస్తున్న మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి తదితరులు
Sabitha Indra Reddy | నాగర్కర్నూల్, జూన్ 22 : రాష్ర్టాన్ని రావణ కాష్టంగా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి విమర్శించారు. అఘాయిత్యానికి గురై నాగర్కర్నూల్ దవాఖానలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం మొలచింతపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను శనివారం వారు పరామర్శించారు. ఆమెతో మాట్లాడి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆమెకు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. మెరుగైన వైద్య సేవల అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చెంచు మహిళపై పాశవిక దాడి జరగడం అత్యంత బాధాకరమని అన్నారు.
మహిళా డాక్టర్ పర్యవేక్షణలో ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డ్యూటీ డాక్టర్లతో నామమాత్రంగా వైద్యసేవలు అందించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదని, రాక్షస పాలన కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దాడులను నియంత్రించడంలో అధికారులు, పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. ఈ దాడిపై సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మొలచింతపల్లి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన మరో ముగ్గురిని సైతం అరెస్టు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ తరపున బాధితులకు అండగా ఉండేందుకు సీఎస్, డీజీపీతో మాట్లాడుతామని వారు తెలిపారు.
చెంచు మహిళకు 2 లక్షల ఎక్స్గ్రేషియా
నాగర్కర్నూల్, జూన్ 22 : అఘాయిత్యానికి గురై నాగర్కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి చెంచు మహిళ ఈశ్వరమ్మను శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఆమెకు భరోసానిచ్చారు. మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు.
నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే స్పందించామని, ఎస్పీతోపాటు ఇతర పోలీస్ అధికారులకు ఫోన్చేసి నిందితులను అరెస్టుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆమె ముగ్గురు పిల్లలకు గురుకుల విద్యను అందిస్తామని, కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని ధైర్యం చెప్పారు.