Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో జూలై 1(నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట, ఉస్మానియా యూనివర్సిటీ/బడంగ్పేట్/చిక్కడపల్లి: రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కదం తొక్కింది.
హైదరాబాద్లో గాంధీ దవాఖాన, ఉస్మాని యా యూనివర్సిటీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, బడంగ్పేట మున్సిపల్ కార్యాలయాలు కేంద్రాలుగా విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు, నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూనే 8 రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్యాదవ్, నిరుద్యోగ సంఘం నాయకుడు బక్క జడ్సన్, బీఆర్ఎస్వీ ఓయూ విద్యార్థి నాయకుడు అవినాశ్తోపాటు పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు మోతీలాల్ను పరామర్శించేందుకు గాంధీ దవాఖానకు చేరుకోగా, వారిని మెయిన్గేట్ వద్దనే పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యే పల్లా అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదంలో పలువురు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులతో కూడా చిలకలగూడ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. మీడియా కవరేజీ కోసం వెళ్తామని చెప్పినా దవాఖానలోకి అనుమతించలేదు.
మోతీలాల్నాయక్కు మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఉద్రిక్తత నెలకొన్నది. మెయిన్ లైబ్రరీ నుంచి విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడే బైటాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనచేస్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ.. బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రొఫెసర్ కోదండరాం క్షమాపణ చెప్పాలని అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఓయూ వేదికగా వేలాదిమందితో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జంగయ్య, కార్తీక్, వినోద్, హనుమంతు, సతీశ్, శివ, లింగ, సుభాష్, శ్రీను, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేటలో బల్మూరి దిష్టిబొమ్మ దగ్ధం
ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరుద్యోగులు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. గాంధీలో దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్కు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతామని స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టాడిస్తామని హెచ్చరించారు.
చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో నిరసన
మోతీలాల్నాయక్కు మద్దతుగా చిక్కడపల్లి నగర గ్రంథాలయంలో నిరుద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల అం డదండలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం పదవిని ఆశించి నిరుద్యోగులకు గురించి మాట్లాడకుండా, ఇంట్లో కూర్చున్నారని మండిపడ్డారు.
మోతీలాల్ డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తిచేశారు. మోతీలాల్ను పరామర్శిస్తే తప్పేమిటని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత దారుణం చూడలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వానికి సమస్య ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నదనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. మోతీలాల్నాయక్ను పరామర్శించడానికి ఒక్క మంత్రికి కూడా తీరిక లేదా? అని ప్రశ్నించారు.
రేవంత్ రాజీనామా చేయాలి : బక్క జడ్సన్
ఉద్యోగ నోటిఫికేషన్లపై మాట నిలుపుకోని రేవంత్రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బక్క జడ్స న్ డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి పనికిమాలిన, అవగాహన లేని, 420 ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎక్కడకు పోయాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు.