హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ(BRS Pary) మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Laxmi) స్పందించారు. పార్టీ మారుతున్నారన్న వార్తలను ఆమె ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారను అని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్లోనే కొన సాగుతానని స్పష్టం చేశారు. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తనతో పాటు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు.
కొంతమంది అనేక పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు వెళ్లిపోతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్ నేతలకు బీఆర్ఎస్ అధితనే ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పార్టీ అవసరాల దృష్టా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికన్నా ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి నేతను, పార్టీని విస్మరించి వ్యక్తిగత అవసరాల కోసం ఇతర పార్టీలు మారడం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదన్నారు.