ఆసిఫాబాద్ : మంత్రి సీతక్కపై(Minister Seethakka) ఎమ్మెల్యే కోవ లక్ష్మి( MLA Kova Lakshmi) ఫైర్ అయ్యారు. మంత్రి అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్(Protocol) పాటించలేదని ఆరోపించారు. ప్రోటోకాల్ తెలియకుండా సీతక్క మంత్రి ఎలా అయిందోనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజకీయంలో గెలుపు, ఓటములు సహజం. అధికారంలో శాశ్వతం కాదన్నారు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదన్నారు.
రాజకీయ పదవులు ఇచ్చేది ప్రజలు. ప్రజల కోసం పని చేయాలి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పార్టీ అనే తేడా లేకుండా ప్రోటోకాల్ ఉన్న నాయకులను స్వాగతించడం అనేది రాజకీయ నాయకుల కనీస లక్షణం అన్నారు. ఇవేవి తెలియకుండా మంత్రి రాజకీయంలో ఉండడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రోటోకాల్ లేని పోలీస్ అధికారి విశ్వప్రసాద్, శ్యామ్ నాయక్తో అధికారిక కార్యక్రమంలో రిబ్బెన్ కట్ చేయించడం సిగ్గు చేటన్నారు. అధికారం ఉందని విర్రవీగితే చూస్తూ ఊరుకోమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారుల భరతం పడుతామన్నారు.