TPCC | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి ఎంపికపై రెండు రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజులలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి మాట నెగ్గుతుందా? లేక ఇతరుల మాట నెగ్గుతుందా? అనేది కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ లేక మహబూబాబాద్ ఎంపీ బల్రాం నాయక్ పేర్లను రేవంత్రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో మొదట చర్చించిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఆ తర్వాత మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితర ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్న ఆమె పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు నివేదించినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అనుసరించాల్సిన సామాజిక సమీకరణలపై సీఎం తన వాదనను అధిష్ఠానానికి వినిపించగా, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నట్టు కేసీ తెలిపినట్టు సమాచారం.
కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
చేవెళ్లకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్యను సీఎం రేవంత్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్దకు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించారు.