Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లెల ప్రగతికి నెలకు రూ. 275 కోట్లు, ఏడాదికి రూ. 3,330 కోట్లు ఖర్చు పెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తు చేశారు. ఈ నిధులన్నింటిని పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు కేటాయించలేదు అని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలకు ఏడాదికి రూ. 1700 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి ఏడు నెలలు అయినా ఏడు పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా..? మలేరియా, డెంగీ వంటి వైరల్ ఫివర్ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు..? బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేశాం. దాదాపు ఈ రెండింటికి గత ఐదేండ్లలో రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. ఏడు నెలల కాలంలో 20 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా..? అని హరీశ్రావు తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కూడా ఏడు నెలలుగా జీతాలు అందడం లేదు. తక్షణమే పారిశుధ్య కార్మికులతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పోకడ. పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అడడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక కొత్త పోస్టును క్రియేట్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లెల అభివృద్ధి కోసం వారి సేవలను వినియోగించుకున్నాం. ఇప్పుడు ఆ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పల్లెలను గాడిన పెట్టండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్రావు సూచించారు.