హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఏడు మండలాలపై తేల్చాకే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్రెడ్డి చర్చించాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఏడు మండలాలు, లోయర్ సీలేరును ఏపీలో కలపడాన్ని అప్పట్లో కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి సహచరుడు చంద్రబాబు మీదనే ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడి ఉన్నదని, కాబట్టి చంద్రబాబుపై ఒత్తిడి చేసి తెలంగాణ కోల్పోయిన ఏడు మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని రేవంత్ను కోరారు.
మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలో పట్టణాలు, పంచాయతీలకు పైసా కూడా ఇవ్వకపోవడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయిందని, దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రగతి, పల్లెప్రగతి ద్వారా ప్రతినెలా స్థానిక సంస్థలకు టంచన్గా నిధులు విడుదల చేశామని గుర్తుచేశారు. తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని, పల్లెలు అద్దాల్లా మారాయని, జాతీయస్థాయిలో అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ కూడా ఉండేదని గుర్తుచేశారు.
ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ కట్టలేదని, బీమా లేదని ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారంటూ సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం అనంతసాగర్లో జరిగిన ఘటనను హరీశ్రావు వివరించారు. రూ.16వేల ఫైన్ వస్తే కార్యదర్శులు సొంత డబ్బులు కట్టి విడిపించుకున్నారని తెలిపారు. గ్రామ కార్యదర్శులు సొంత డబ్బులతో డీజిల్ పోయించుకుంటున్నారని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులు 7 నెలలు జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారని చెప్పారు. ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న కాంగ్రెస్ పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్లులు విడుదల చేయాలని గవర్నర్ను కలిసి సర్పంచులు వినతిపత్రం ఇచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పారు. తాము పంచాయతీలకు ప్రతి నెలా రూ.275 కోట్లు, ఏటా రూ. 3,330 కోట్లు పల్లెల్లో అభివృద్ధి కోసం ఇచ్చామని, పట్టణాలకు ఏటా 1700 కోట్లు ఇచ్చే వాళ్లమని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ అని పోస్ట్ పెట్టి వాటి బలోపేతానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచుల పదవీకాలం ఇప్పటికే ముగిసిందని, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల పదవీకాలం కూడా ముగుస్తున్నదని, వీటికి కూడా ఎన్నికలు నిర్వహించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ముందు రాష్ట్రంలో 87 ట్రాక్టర్లు మాత్రమే ఉంటే, నేడు 12,769 పంచాయతీల్లో ట్రాక్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటువేసిన పాపానికి ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆ వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చాయని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దారుణ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతున్నదని చెప్పారు. ప్రభాకర్ మరణానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.ప్రభాకర్ ఆత్మహత్యపై ఉన్నతస్థాయి విచారణ జరపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికేదైనా కష్టం వస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతు తన వాంగ్మూలంలో రేవంత్రెడ్డి పేరు చెప్పాడని పేర్కొన్నారు. బాధ్యులను అరెస్ట్ చేసి కేసులుపెట్టి ఆయన భూమి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్కడ బకాయిలతో కలిపి రూ. 4 వేల పింఛన్ ఇస్తే, ఇక్కడ ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవి, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, రామ్మూర్తియాదవ్ పాల్గొన్నారు.