PM Modi | మణికొండ, జూన్ 30: మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవితమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. వెంకయ్యనాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో ఆయన మిత్రులు పంచసప్తతి పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకయ్య జీవన ప్రస్థానం ఆధారంగా రాసిన మూడు పుస్తకాలు ‘వెంకయ్యనాయుడు (ఐ లైఫ్ ఇన్ సర్వీస్)-జీవన ప్రస్థానం-ఆంగ్లం, సెలబ్రేటింగ్ భారత్ (13వ ఉపరాష్ట్రపతిగా ఐదేండ్ల ప్రయాణం)-ఆంగ్లం, మహానేత (జీవన చిత్రమాలిక)-తెలుగు’ పుస్తకాలను ప్రధాని మోదీ ఆన్లైన్లో ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి పెద్ద పదువులు చేపట్టిన వెంకయ్యనాయుడి అనుభవ సంపద అమూల్యమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో కొన్ని దశాబ్దాల క్రితం బీజేపీ, జనసంఘ్కు పునాది లేని రోజుల్లోనే వెంకయ్యనాయుడు ఏబీవీపీ కార్యకర్తగా ఎంతో కష్టపడి, పార్టీలో కీలకంగా ఎదిగారని కొనియాడారు. వెంకయ్యనాయుడు సౌమ్యత, చమత్కారంతో కూడిన వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన ప్రధాని.. ఆయన తెలివితేటలు, సహజత్వం, త్వరితగతిన ప్రతిస్పందించటం, వన్లైనర్లకు ఎవరూ సాటి రారని ప్రశంసించారు. దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు సేవలను ప్రశంసించిన మోదీ, ఈ రోజు ఆవిష్కరించిన మూడు పుస్తకాలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనుందని, అదే సమయంలో వెంకయ్యనాయుడు కూడా తన జీవన శతాబ్ది మైలురాయిని దాటాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి సందేశానికి వెంకయ్య ధన్యవాదాలు తెలుపుతూ.. మోదీ నాయకత్వంలో దేశం ప్రగ తిబాటన పయనిస్తున్నదని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు మరింత కృషి జరగాలని ఆకాంక్షించిన వెంకయ్య.. ప్రజలకు ఉచితాలను అలవాటు చేయవద్దని సూచించారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు హజరై వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, మిజో రం గవర్నర్లు రా ధాకృష్ణన్, కంభంపాటి హరిబాబు, కేంద్రమం త్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర మా జీ మంత్రి టీ హరీశ్రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆ రాష్ట్ర మంత్రు లు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సత్యకుమార్యాదవ్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సృజనాచౌదరి తదితరులు పాల్గొన్నారు.