UGC NET | న్యూఢిల్లీ, జూన్ 19: ఓవైపు నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)ను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. నెట్ పరీక్షలో పలు అవకతవకలు జరిగినట్టు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. పరీక్ష సమగ్రత దెబ్బతిన్నట్టు కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి(ఐ4సీ) చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలటిక్స్ యూనిట్ నుంచి యూజీసీకి సమాచారం వచ్చిందని ఎన్టీఏ వెల్లడించింది. పరీక్ష ప్రక్రియ ఉన్నత స్థాయి పారదర్శకత, పవిత్రతను కాపాడేందుకు యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసేందుకు కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకొన్నదని తెలిపింది.
కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని, సంబంధిత సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని ఎన్టీఏ ఓ ప్రకటనలో పేర్కొన్నది. నెట్ పరీక్షలో అవకతవకల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలిపింది. యూజీసీ-నెట్ పరీక్షను మంగళవారం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 సెంటర్లలో నిర్వహించారు. ఓఎంఆర్(పెన్, పేపర్) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష లీక్ అయిందని, పరీక్షలో అక్రమాలు జరిగాయని పెద్దయెత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఈ అంశం ఇప్పుడు దేశంలో హాట్టాపిక్గా మారింది. నీట్ అంశంపై సుప్రీంకోర్టుకు ఎక్కడంతోపాటు అభ్యర్థులు, విద్యా సంఘాలు, రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. నీట్ లీకేజీ, అక్రమాల ఉదంతాలు బీహార్, గుజరాత్ రాష్ర్టాల్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ర్టాల్లో పోలీసు కేసులు నమోదు చేయడంతోపాటు, పలువురిని అరెస్టులు కూడా చేశారు. నీట్ పరీక్షలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మంది విద్యార్థులు 720/720 మార్కులు సాధించి టాప్ ర్యాంకు సాధించడం అందరినీ నివ్వెరపరిచింది. అందులోనూ హర్యానాలో ఫరీదాబాద్లోని ఒక సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు టాప్ ర్యాంక్ సాధించడం మరింత ఆశ్చర్యపరిచే అంశం. మరోవైపు సమయం కోల్పోవడం, ఇతరత్రా కారణాలతో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం మరొక అంశం. తీవ్ర విమర్శల నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకొన్న ఏన్టీఏ.. వారికి తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది.
బీహార్లోని పాట్నాలో నీట్ యూజీ-2024 పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ బుధవారం రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం నుంచి నివేదిక కోరింది.