Civil Supplies | హైదరాబాద్, జులై 1(నమస్తే తెలంగాణ): పౌరసరఫరాల సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. మంత్రిది ఒకమాటగా.. అధికారులది ఇంకోమాటగా అన్నట్టు ఉన్నది. సన్నబియ్యం టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్ ఇటీవల ప్రకటించారు. కానీ దీనికి సంబంధించి అధికార ఉత్తర్వులు ఇప్పటి వరకూ విడుదల కాలేదు. కాకపోతే బిడ్డర్ల నుంచి సన్నబియ్యం సేకరణ చేయొద్దని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
పౌరసరఫరాల సంస్థ మార్చిలో 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలుకు టెండర్లను పిలిచింది. కిలో బియ్యం ధరను సగటున రూ. 57గా బిడ్డర్లు కోడ్ చేశారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు సన్న బియ్యం లభిస్తుంటే పౌరసరఫరాల సంస్థ మాత్రం టెండర్ల ద్వారా అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయడంపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పించాయి. టెండర్లలో వందల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించాయి. దీంతో స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సన్నబియ్యం టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మంత్రి ఉత్తమ్ ఆదేశించినా అధికారులు స్పందించడం లేదా? లేక ఇంకేమైనా మతలబు ఉన్నదా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి.