హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): క్షేత్రస్థాయిలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలని, వచ్చే మూడు, నాలుగు నెలలు రైతులకు, వ్యవసాయ శాఖకు చాలా కీలకమని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు వేర్వే రు కాదని, రెండు శాఖల అధికారులు కలిసి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
మంగళవారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయంను మంత్రి ప్రారంభించా రు. భూసార, విత్తన, ఎరువుల పరీక్షల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7.90 కోట్ల వ్యయంతో ఈ ల్యాబ్ను నిర్మించింది. దీన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాస్థాయి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న మూడు నెలల్లో రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా ద్వారా రూ.50-60 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.