Telangana | మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా, ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భూముల ధరలు సవరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఏఏ ప్రాంతాలలో ఎక్కువ వ్యత్యాసం ఉంది? అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే, ప్రభుత్వ ధర అధికంగా ఉంటే అక్కడ తగ్గించాలని సూచించారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని.. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద చూసే పరిస్థితి లేకుండా అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లకు టైమ్ స్లాట్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పని భారం అధికంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు. పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలను చేపడుతామని హామీ ఇచ్చారు.