Congress Govt | వరంగల్, జూలై 4 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అయోమయంగా సాగుతున్నది. మంత్రుల గజిబిజి కార్యక్రమాలతో ఎమ్మెల్యేలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యం లో గురువారం హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు.
మంత్రులు సురేఖ, సీతక్క, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సీఎం సలహాదారు నరేందర్రెడ్డి, మేయర్ సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాశ్రెడ్డి, మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఈ సమీక్షకు గైర్హాజరయ్యారు.
మంత్రి పొంగులేటి సమీక్ష సమయంలోనే వరంగల్లోని ఎల్బీ కాలేజీ 50వ వార్షికోత్సవానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. దీంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెలే రాజేందర్రెడ్డి సమీక్షకు హాజరు కాలేదు. గ్రేటర్ వరంగల్లోని ఎక్కువ ప్రాంతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉంటుంది. తాను హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సమీక్ష నిర్వహించడంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు.
మరోవైపు మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే జనగామలో దొడ్డి కొముర య్య విగ్రహావిష్కరణకు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఎవరికి వారుగా ఒకే ఉమ్మడి జిల్లాలో పాల్గొనడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.