హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు ఎదుర్కొంటున్నారా? వెరీ సింపుల్.. కాషాయం ధరించండి, బీజేపీ తీర్థం పుచ్చుకోండి మీ కేసులన్నీ మటుమాయం..ఇదే అర్థం వచ్చేలా హైదరాబాద్వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. శనివారం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో వెలసిన ఈ పోస్టర్లు ఆసక్తిగా మారాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ పలువురు నేతల పరిస్థితిని ఈ పోస్టర్లు కళ్లకుకట్టాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ దాడులు జరగ్గానే బీజేపీలో చేరి కాషాయరంగు పులుముకున్నట్టు పోస్టర్లు వేశారు.
ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ, పశ్చిమబెంగాల్ నేత సువేందు అధికారి, ఏపీకి చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె తదితర నేతల దుస్తులపై కాషాయరంగు పడ్డాక ఉన్న పరిస్థితిని పోస్టర్లలో చూపించారు. కేంద్ర దర్యాప్తుసంస్థల దాడులకు ముందు, తర్వాత ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి మరక అంటకుండా ఉన్నారని, నిజమైన రంగులు ఎన్నటికీ వెలిసిపోవు, బైబై మోదీ ట్యాగ్లైన్తో వెలసిన పోస్టర్లు బీజేపీ తీరును ఎండగట్టాయి. అలాగే ప్రజాస్వామ్య విధ్వంసకుడంటూ ప్రధాని మోదీపైన కూడా పోస్టర్లు సోషల్మీడియాలో వైరలయ్యాయి. మోదీని పదితలల రావణుడిగా ఈ పోస్టర్లలో చూపించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, అదానీ, ఈసీ, డీఆర్ఐ, ఐబీ, ఎన్సీబీ, ఎన్ఐఏ సంస్థలను మోదీ ఒక్కో తలగా చూపెడుతూ డిజైన్ చేసిన ఈ పోస్టర్లపై జాతీయ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది.
కవితమ్మా.. ధైర్యంగా ఉండు: వేముల
‘పిచ్చి కుకలను వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తాయి. అంత మాత్రాన వేట ఆపుతామా? కవితమ్మా.. ధైర్యంగా ఉండండి’ అని ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధైర్యం చెప్పారు. శనివారం కవిత ఈడీ విచారణకు హాజరయ్యే సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మనమందరం ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మ పోరాటంలో మీతో పాటు ఉన్నాం. ఉంటాం కూడా. ధర్మం మీవైపు ఉన్నది. అంతిమ విజయం మీదే. మనదే’ అని ట్వీట్ చేశారు.
బండివి దిగజారుడు రాజకీయాలు: అల్లోల
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ఎమ్మెల్సీని అవమానించేలా మాట్లాడటం తగదని హెచ్చరించారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ను ఎదురోలేక ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేయడం శోచనీయమన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
బండిని చీపురుతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి
కవితపై బండి అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి మల్లారెడ్డి ఫైర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆడబిడ్డలు బండి సంజయ్ని చీపురుతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఎమ్మెల్సీ కవితను కావాలనే కేసులో ఇరికించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి బీజేపీ చీప్ ట్రిక్కులకు సీఎం కేసీఆర్ భయపడే వ్యక్తి కాదన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అనేటోడు ఓ మెంటలోడని, మహిళలు అని చూడకూండా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీకు అక్కాచెల్లెళ్లు లేరా?’ అని ప్రశ్నించారు. బండి మాటలు దుర్మార్గపు చర్యలు అని, పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలకు తగిన రీతిలో దేశ ప్రజలంతా బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.