పాట్నా: తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బీహార్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామానికి చెందిన 23 ఏండ్ల శుభేందు పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలో వైద్య విద్య చదువుతున్నాడు. ఎంబీబీఎస్ చివరి ఏడాది విద్యార్థి అయిన ఆయనకు గత నెల చివరి వారంలో కోవాగ్జిన్ టీకా తొలి డోసు వేశారు. అతడు రెండో డోసు తీసుకోవాల్సి ఉన్నది.
కాగా, ఫిబ్రవరి 24న దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆ వైద్య విద్యార్థికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సొంతూరులోని తన ఇంటికి వెళ్లిన శుభేందు ఈ నెల 1న చనిపోయాడు. మరోవైపు అతడు ఉన్న కాలేజ్ హాస్టల్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
అయితే కరోనా టీకా రెండో డోసు తీసుకోనంత వరకు తొలి డోసు టీకా వల్ల ఎలాంటి ఫలితం ఉండదని వైద్య నిఫుణులు తెలిపారు. టీకా రెండు డోసులు పూర్తయిన తర్వాతే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు.