మనం నిర్మించే ప్రతి రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా రోజూ పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు. ఎన్ని కోట్లు పెట్టిన పోయిన ప్రాణం తిరిగి రాదని.. ప్రభుత్వం నిర్మించాల్సిన రోడ్డు మూలంగా ప్రజల ప్రాణాలు పోతే.. ఇక ప్రభుత్వం ఉండి ఎందుకని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని న్యాక్ ఆఫీసులో జాతీయ రహదారులపై ఎన్హెచ్(MoRTH), ఎన్హెచ్ఏఐ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రానికి మణిహారంగా మారనున్న రీజినల్ రింగ్ రోడ్డు ( ఆర్ఆర్ఆర్ )పై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. జూలై మొదటి వారంలో ఎన్హెచ్ ఉన్నతాధికారుల బృందం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మంజూరై పనులు నడుస్తున్నవి, పలు అనుమతుల కోసం పనులు ఆగిపోయినవి, అప్గ్రేడ్ కోసం విన్నవించిన జాతీయ రహదారులకు సంబంధించిన సమస్త సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో మరింత చురుగ్గా పనులు చేయాలని మంత్రి సూచించారు. ఒక్క ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమైతే రాష్ట్రానికి ఎంటర్టైన్మెంట్ జోన్లు, డిస్నీల్యాండ్ వంటి ప్రఖ్యాత సంస్థలు, ట్రాన్స్పోర్టు హబ్లు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పడి రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు.
మన్నెగూడ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం 930 చెట్లను రిలోకేట్ చేయాల్సి ఉండటంతో పాటు పలు అనుమతుల వల్ల ఆలస్యమవుతుందని ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. అప్పుడు చెట్లు లేకుండా రోడ్ల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు ఎందుకు నిర్మించడం లేదని మరోసారి ప్రశ్నించారు. ఆలస్యానికి సాకులు వెతక్కుండా, జరగాల్సిన పనులు జరపాలని అన్నారు. ఇబ్బందులు ఉన్నచోట్ల సమస్యల్ని పరిష్కరించేందుకు మార్గం వెతకాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రీలొకేట్ చేయాల్సిన 330 చెట్లను కాంట్రాక్టు సంస్థతో రేపు మాట్లాడి చేయిస్తానని చెప్పారు. మిగితా వాటి సంగతిని వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్ట్ను ఫోర్ క్లోజ్ చేసి, వచ్చే నెలలో కొత్త టెండర్లు పిలిచి, సెప్టెంబర్లో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి తెలిపారు. ఇందులో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ప్రతి నిత్యం పర్యవేక్షించాలని జాతీయ రహదారుల సంస్థ ఆర్వో రజాక్ను ఆదేశించారు. ఆర్మూర్-మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా.. ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని ఈ సందర్భంగా మంత్రికి అధికారులు తెలిపారు. మిగతా పనులను ఈ నెలలో పూర్తి చేస్తామని వివరించారు. వీటితో పాటు ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు ఫోర్క్లోజ్ చేసి కొత్త టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా సంస్థలను ఖరారు చేయాలన్నారు. ఫ్లైఓవర్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎల్బీనగర్-మల్కాపూర్ రోడ్డులో మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద నిర్మించాల్సిన బ్రిడ్జ్ సమస్యల గురించి మంత్రికి అధికారులు వివరించగా పరిష్కారానికి హామీ ఇచ్చారు.