కొల్లాపూర్: కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) పరామర్శించారు. నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించిన మంత్రి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆమెకు అండగా ఉంటుందని చెప్పారు. తక్షణ సహాయంగా రూ.2 లక్షలు, ప్రభుత్వం తరఫున కొంత భూమి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వరమ్మ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తామని తెలిపారు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏం జరిగిందంటే.. ఈశ్వరమ్మ, భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. ఆ భూమిలో వెంకటేశ్ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగ తన దగ్గరే ఈదన్న, బాధితురాలు ఈశ్వరమ్మ పని చేసేవారు. ఒక రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈశ్వరమ్మ పనికి రావట్లేదని యజమాని వెంకటేష్.. ఈశ్వరమ్మను పుట్టింటి నుండి తీసుకొచ్చి తన దగ్గరే గదిలో బంధించి పాశవికంగా దాడి చేశాడు. ఈశ్వరమ్మను మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.