హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నల్లమలను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు నల్లమలలో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. ఎకో టెంపుల్, రివర్ టూరిజం సమూహాల అభివృద్ధి, వసతుల కల్పనపై అధ్యయనం చేయనున్నారు.
మన్ననూర్లోని ఈఈసీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్, బయోల్యాబ్, వ్యూ పాయింట్, కదళి వనం పరిశీలన అనంతరం బెహ్రపూర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. శనివారం అక్కమాంబ బిలం, రివర్ బోటింగ్, మద్దిమడుగు, గీసుగండి రివర్ పాయింట్, ప్రతాపరుద్రుని కోటను సందర్శించనున్నారు.